అవసరమైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తా: పవన్ కల్యాణ్
అవసరమైతే తాను తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. వైసీపీ వేధింపులను ప్రస్తావిస్తూ తాను తాడేపల్లిగూడెంలో కూర్చుంటానని ఆయన చెప్పారు.
ఏలూరు: అవసరమైతే తాను తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అమరావతిలో తాడేపల్లిగూడం ఇంచార్జీ బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వేధింపులపై అవసరమని అనుకుంటే స్వయంగా తాను వచ్చి తాడేపల్లిగూడెంలో కూర్చుంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు బిజెపితో సంప్రదింపులు జరిపిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని చెప్పారు.
పార్టీ విజయానికి పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ వైసీపీ నుంచి ఎదుర్కుంటున్న వేధింపులను బొలిశెట్టి పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనం వంటి విషయాలను ఆయన పవన్ దృష్టికి తెచ్చారు.
దానిపై అవసరమనుకుంటే న్యాయపోరాటం చేస్తామని, అందుకు సహకరించాలని ఆయన చెప్పారు. పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జా గురించి కూడా పవన్ కు ఆయన వివరించారు. దానిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
సమీక్షా సమావేశంలో తాడేపల్లిగూడం నాయకులు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగుల సురేష్, మారిశెట్ిట అజయ్ తదితరులు పాల్గొన్నారు.