భూ స్కామ్ లో చంద్రబాబుకూ పాత్ర: పవన్ కల్యాణ్, జగన్ కు చురకలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు.
శుక్రవారం ఉదయం గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, తదితరులు జనసేనలో చేరిన సందర్భంగా రుషికొండలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవినీతి చేసిందో ఆధారాలతో నిరూపించాలని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అడుగుతున్నారని గుర్తు చేస్తూ అవినీతి లేకపోతే విశాఖపట్నం భూ కుంభకోణంపై సిట్ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
ఆ కుంభకోణంలో ముఖ్యమంత్రి సహా పలువురు నేతలకు ప్రమేయం ఉందనిస అందుకే దానిని గుండెల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు.
ఒకాయన ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే.. అది చేస్తా ఇది చేస్తానని చెబుతున్నారని, ఏ పదవి లేకుండానే ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారే నిజమైన నాయకులని ఆయన పరోక్షంగా జగన్ కు చురకలు అంటించారు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.
విశాఖకు రైల్వేజోనూ లేదు.. గీనూ లేదని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఐదు కిలోల బరువు తగ్గడానికి వారం రోజులు దీక్ష చేస్తానని మరో ఎంపీ వ్యాఖ్యానించారంటే వారు ఎంత బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని ఆయన దుయ్యబట్టారు.
ప్రజలను వారు బానిసలుగా చూస్తున్నారని, చొక్కా పట్టుకొని నిలదీయకపోతే ఇంకా బానిసలుగా మార్చేస్తాని పవన్ అన్నారు. ఈసారి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయమని జోస్యం చెప్పారు.