దొంగ పేపర్, దొంగ చానెల్ ట్రాప్ లో పడి...: సాక్షి మీడియాపై నారా లోకేష్
అచ్చెన్నాయుడు మందులు, వస్తువుల కొనుగోళ్లకు ఏ విధమైన లేఖలు కూడా రాయలేదని ఆధారాలున్నా దొంగ పేపర్, దొంగ చానల్ లీక్ వార్తలను ప్రసారం చేస్తున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగ పేపర్, దొంగ చానెల్ ట్రాప్ లో పడి మీ పరువు తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. రెండు వేల కోట్లు అంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు.
ఉన్నది రూ.2 లక్షలేనని తెలిసిన తర్వాత నాలుక కరుచకున్నారని ఆయన అన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో 2 వేల కోట్లు పట్టుబడ్డాయనే వార్తలను ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.
Also Read: అచ్చెన్నాయుడు, గణేష్ లను టార్గెట్ చేసింది అందుకే..: వైసిపిపై చంద్రబాబు ఆగ్రహం
ఇప్పుడు బీసీ నాయకుడిపై విరుచుకుపడ్డారని ఆయన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ అన్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తుగ్లక్ బీసీ నిధులను పక్కదారి పట్టించారని గళమెత్తినందుకు అచ్చెన్నాయుడికి అవినీతి మరక అంటించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read: మోడీ ఆదేశాల మేరకే, విచారణ చేసుకోవచ్చు: ఈఎస్ఐ కుంభకోణంపై అచ్చెన్నాయుడు
మందులు, వస్తువుల కొనుగోళ్లకు ఏ విధమైన లేఖలు కూడా అచ్చెన్నాయుడు రాయలేదని ఆయన స్పష్టం చేశారు. అందుకు ఆధారాలున్నా లీక్ వార్తలతో ఏదో పీకాలని దొంగ పేపర్, దొంగ చానల్ తాపత్రయపడడంలో తప్పు లేదని లోకేష్ అన్నారు. కానీ మిగిలినవాళ్లు క్విడ్ ప్రో కో వార్తల ట్రాప్ లో పడితే ఉన్న విలువ పోతుందని ఆయన అన్నారు.