తప్పు చేశారు కాబట్టే: బాబు, లోకేశ్పై మంత్రి శ్రీరంగనాధ రాజు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేశ్లపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేశ్లపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ సోదాలపై చంద్రబాబు, లోకేశ్లు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు.
ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసిన వెంటనే ఇద్దరు రాత్రికి రాత్రే హైదరాబాద్కు వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. రోజుకు పదిసార్లు మీడియా ముందుకు వచ్చే తండ్రి కొడుకులు నేడు మొహం చాటేశారని.. తప్పు చేశారు కాబట్టే వారు మీడియా ముందుకు రాకుండా తమ నాయకులతో మాట్లాడిస్తున్నారని రాజు ఆరోపించారు.
Also Read:శ్రీనివాస్ వద్ద చంద్రబాబు పాస్ వర్డ్ వదిలేశాడు: ఐటి దాడులపై విజయసాయి
చంద్రబాబు ఐదు కంపెనీలను ఏర్పాటు చేసి సబ్ కాంట్రాక్ట్స్ ద్వారా నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారని రంగనాథ రాజు విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రెండు లక్షల నగదు మాత్రమే ఐటీ శాఖకు దొరికిందని ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఐటీ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయని.. చట్టాలకు ఎవరూ అతీతులు కారని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు స్వప్రయోజనాలు కోసం వాడుకుకున్నారని శ్రీరంగనాథరాజు మండిపడ్డారు.
Also Read:నేనూ పోస్టు చేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి: జగన్ పై నారా లోకేష్
మరో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఐటీ దాడుల్లో వేల కోట్ల అక్రమాలు వెలుగు చూడటం టీడీపీ పాలనలో జరిగిన అవినీతికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. తీగ లాగితే డొంక మాత్రమే కదిలిందని.. ఇంకా లక్షల కోట్ల అవినీతి బండారం బయటపడాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని వనిత డిమాండ్ చేశారు.