Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో  అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను  ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

facts and significance about history of andhra pradesh formation day lns
Author
First Published Oct 31, 2023, 5:51 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పరణంతో ప్రారంభమైన ఆంధ్ర రాష్ట్రం.. హైద్రాబాద్ రాష్ట్రం విలీనంతో ఆంధ్రప్రదేశ్ గా మారింది.  ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గతంలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుందాం..
  

గతంలో ఉమ్మడి మద్రాస్ లో అన్యాయానికి గురౌతున్నామనే భావనతో  ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ నెలకొంది.  అదే తరహలో  ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కూడ ముందుకు వచ్చింది. 


పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం,  భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమంతో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో పాటు  తెలంగాణ విభజన వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే  11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ 11 జిల్లాలు ఆనాడు  మద్రాస్ రాష్ట్రంలో  ఉండేవి.ఆ సమయంలో  భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ కూడ  ఉంది.ఈ విషయమై కమ్యూనిష్టు పార్టీ  అప్పట్లో  ఉద్యమం చేసింది.  ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు  పనిచేశారు. 

1956 నవంబర్ 1న హైద్రాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది.  దీంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. హైద్రాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కావడాన్ని అప్పట్లో హైద్రాబాద్ లో ఉన్న కొందరు  తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా  కూడ  ఆంధ్రప్రదేశ్ లో  హైద్రాబాద్ రాష్ట్రం విలీనమైంది. ఆ సమయంలో  హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  బూర్గుల రామకృష్ణారావు  ఉన్నారు. ప్రజలు మాట్లాడే బాష ఆధారంగా ఏర్పడిన  తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్  చరిత్రకెక్కింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ  ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కూడ జరిగాయి.  

పొట్టి శ్రీరాములు దీక్షకు దారి తీసిన పరిస్థితులు

మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సమయంలో తాము అవహేళనకు గురౌతున్నామని  ఆనాడు ఆంధ్రప్రజలు  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యమించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ లో 40 శాతం జనాభా, 58 శాతం విస్తీర్ణం తెలుగువారిదేనని ఆనాడు  ఉద్యమకారులు  నినదించారు.  ప్రత్యేక  రాష్ట్ర ఉద్యమం 1911 చివరి నాటి నుండి ఊపందుకుంది.  ఈ విషయమై  1912  మే మాసంలో నిడదవోలు లో సమావేశం జరిగింది.  ప్రత్యేక రాష్ట్ర సాధన విషయమై  ఈ సమావేశంలో చర్చించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య  ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

1913లో బాపట్లలో జరిగిన  ఆంధ్ర మహాసభలో  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై  చర్చించారు.  అయితే  రాయలసీమ, విశాఖకు చెందిన ప్రతినిధులు ఈ ప్రతిపాదనకుఅంత సుముఖతను వ్యక్తం చేయలేదు. అయితే ఈ ప్రాంతాల్లో బోగరాజు పట్టాభి సీతారామయ్య  పర్యటించి  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రజల మద్దతును కూడగట్టారు.

ఆ తర్వాత  కాకినాడలో జరిగిన  ఆంధ్రమహాసభలో పట్టాబి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యతో  కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై  కరపత్రం తయారు చేశారు.  ఈ కరపత్రాన్ని విస్తృతంగా  పంచి పెట్టారు. 

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాను 
1952  అక్టోబర్  19న పొట్టి శ్రీరాములు  నిరహార దీక్షను  ప్రారంభించారు.పొట్టి శ్రీరాములు  దీక్షకు మద్దతు రోజు రోజుకు పెరిగింది.  మద్రాసును వదులుకొంటే  ఆంధ్ర రాష్ట్రం సాధ్యమౌతుందని  అప్పటి ప్రధాని నెహ్రు ప్రకటించారు. ఇందుకు పొట్టి శ్రీరాములు అంగీకరించలేదు . తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారు.  దీంతో ఆంధ్రలో పెద్ద ఎత్తున  హింస చెలరేగింది. మద్రాసును మినహాయించి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని  ప్రధాని నెహ్రు ప్రకటించారు.వాంచూ నివేధిక ఆధారంగా  1953 మార్చిన  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నెహ్రు ప్రకటించారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత  రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది.  1937 నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కొత్త రాష్ట్రానికి కర్నూల్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడింది.  కాంగ్రెస్, కమ్యూనిష్టులతో అన్ని పార్టీలు దీన్ని సమర్ధించాయి.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు


1953 డిసెంబర్ లో ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను కేంద్రం ఏర్పాటు చేసింది.1955 సెప్టెంబర్ 30న  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును  ఈ కమిషన్ సమర్ధించింది.  మహారాష్ట్రలోని, కర్ణాటకలోని  తెలుగు మాట్లాడే ప్రాంతాలను  కలిపి తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర శాసనసభలో  మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరిస్తే  ఆంధ్రలో విలీనం చేయవచ్చని  కమిషన్ సూచించింది. కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులు ఈ కమిషన్ సూచనలను సమర్ధించారు. అప్పటి అసెంబ్లీలో ఈ చర్చ జరిగిన సమయంలో  103 మంది సమర్ధించారు.  

ఈ విషయమై  కమ్యూనిష్టు పార్టీ కీలక ప్రకటన చేసింది.  తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడ ఆంధ్రప్రదేశ్ ను సమర్ధించింది.   1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నాయకులు సమావేశమయ్యారు. 

తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవీ నర్సింగరావు లు చర్చల్లో పాల్గొన్నారు. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు ఏపీ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు.  పలు దఫాలు అనేక చర్చలు , సంప్రదింపులు జరిగాయి.  1956 జూలై  19న పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే  1956 నవంబర్ 1న నెహ్రు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి సీఎంగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు.


తెలంగాణ ఉద్యమానికి నాంది

పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను  ఆ తర్వాత పాలకులు నిర్లక్ష్యం చేశారనే కారణంగా  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.ఈ సమయంలో  కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలో  పెద్దఎత్తున  ఎంపీ స్థానాలను కూడ కైవసం చేసుకుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనమైంది.   ఆ తర్వాత  కొన్ని సమయాల్లో  కొందరు నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు.  2001లో  కేసీఆర్ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు.  మలిదశ ఉద్యమం అహింస పద్దతిలో సాగింది. తెలంగాణ సాధనలో సకల జనులు పాల్గొనేలా  కేసీఆర్ చేశారు. పార్టీలను పక్కన పెట్టి తెలంగాణ సాధనలో అందరూ భాగస్వామ్యమయ్యారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది.ఈ హామీలో భాగంగానే  2014లో  పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును యూపీఏ ప్రవేశ పెట్టింది.ఈ బిల్లుకు  బీజేపీ కూడ మద్దతు ప్రకటించింది.  2014 జూన్ 2న ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలుగా విభజించారు.  ఈ మేరకు  ఏపీ పునర్విభజన చట్టం కూడ రూపొందించారు.  

 2014 లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.  అయితే  జూన్ 2న చంద్రబాబు సర్కార్ నవ నిర్మాణ దీక్షలను చేపట్టింది. అయితే 2019లో  ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్  ప్రభుత్వం
నవంబర్ 1న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిఏటా  నవంబర్ 1న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios