రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు..? వసంత కి ఉమా ప్రశ్న
అన్నింటా అవినీతికి పాల్పడుతూ బావమరిదితో ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.100 కోట్లు దోచేసి నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశాడని ధ్వజమెత్తారు.
రాజధాని అమరవాతి తరలిపోతే.. రాజీనామా చేస్తానంటూ గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇప్పుడు మాటమార్చారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. గతంలో రాజీనామా చేస్తానని చెప్పి.. ఇప్పుడు జగన్ నిర్ణయమే శిరోధార్యం అనడం సిగ్గుచేటు అని ఉమా మండిపడ్డారు.
కాగా.. చిత్త శుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని వసంత కృష్ణ ప్రసాద్ ని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ ప్రశ్నించారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్నింటా అవినీతికి పాల్పడుతూ బావమరిదితో ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.100 కోట్లు దోచేసి నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశాడని ధ్వజమెత్తారు.
కొండపల్లిలో జరుగుతున్న అవినీతి గురించి అడిగిన ఓ వైసీపీ కార్యకర్త చెంపను బావమరిది చెళ్లుమనిపించాడని ఆరోపించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం గవర్నర్ ఆమోదించిన బిల్లు ప్రతుల్ని, సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రతుల్ని దగ్ధం చేశారు. మల్లెల రాధాకృష్ణ, దొండపాటి రాము, బుజ్జి, కాజ, మైకు బాబురావు, డోలానాయక్, జల్లి కృష్ణ పాల్గొన్నారు.