దళిత బాలికపై గ్యాంగ్ రేప్... బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి ఓదార్చిన లోకేష్
కామాంధుల చేతిలో కూతురు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురయిన గుంటూరు మైనర్ బాలిక తండ్రికి ఫోన్ చేసి ఓదార్చారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నాారా లోకేష్.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే వున్నాయి. ఇటీవల నడిరోడ్డుపై ఓ ఉన్మాది రమ్య అనే దళిత యువతి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఇదే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి చుట్టాల ఇంటికి వెళ్లిన ఓ చిన్నారిని ఇద్దరు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం గురించి తెలిసిన వెంటనే బాధితురాలికి తండ్రికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి తల్లిపై జరిగిన అఘాయిత్యాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోన్న తండ్రికి ధైర్యం చెప్పారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాలిక తండ్రి చనిపోతానంటూ రోదించగా...అధైర్యపడొద్దని లోకేష్ ధైర్యం చెప్పారు. మరో అమ్మాయికి ఇలా జరగకుండా పోరాటం చేద్దాం అని సూచించారు.
read more పంక్షన్ కోసం.. పక్కూరికి వెడితే.. బాలిక మీద లైంగిక దాడి.. !
అనారోగ్యంతో ఉన్న తన పాపని అత్యంత కిరాతకంగా చెరిచారంటూ ఆ తండ్రి తన బాధను లోకేష్ తో వ్యక్తం చేశాడు. కూతురి గదిలో బంధించి తెల్లవార్లు అతి కిరాతకంగా అత్యాచారం చేశారని... గోర్లతో రక్కుతూ, శరీరంపై ఎక్కడపడితే అక్కడ కొరికారని... కూతురి బాధను చూస్తూ తాను బతకలేనంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.
భోరున విలపించిన అతడిని ఓదార్చిన లోకేష్... ధైర్యం కోల్పోవద్దని సూచించారు. పాపకి మంచి వైద్యం చేయించాలని... నిందితుల్ని శిక్షించేవరకూ పోరాడదామన్నారు. ఇకపై మీ కుటుంబానికి అన్నివిధాలా అండగా వుంటానంటూ లోకేష్ హామీ ఇచ్చారు. చావు పరిష్కారం కాదని... మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా మనమంతా కలిసి పోరాడాలని బాధిత బాలిక తండ్రికి లోకేష్ సూచించారు.
అంతకుముందే ట్విట్టర్ వేదికన కూడా మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై లోకేష్ స్పందించారు. ''రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది'' అని మండిపడ్డారు.
''ప్రతిపక్ష పార్టీల నాయకులని తిట్టడం, కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడం పై పెట్టివుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యి ఉండేవి కావు. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి'' అని జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.