దాచేపల్లి రేప్ కేసు: ఇద్దరు భార్యలను వదిలేసిన నిందితుడు, కృష్ణా వైపు...
దాచేపల్లి ఘటనపై పోలీసు డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య మీడియా సమావేశంలో వివరించారు.
అమరావతి: దాచేపల్లి ఘటనపై పోలీసు డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య మీడియా సమావేశంలో వివరించారు. తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ఇద్దరు భార్యలను కూడా వదిలేశాడని, ఒంటరిగా ఉంటున్నాడని ఆయన చెప్పారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత సుబ్బయ్య కృష్ణా నది వైపు వెళ్లినట్లు తెలుస్తోందని అన్నారు.
గుంటూరు జిల్లాలో ఇటీవల ఏడు అత్యాచార ఘటనలు జరగడం దారుణమని అన్నారు. దాచేపల్లి ఘటనపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.
దాచేపల్లిలో ప్రజలూ ఆందోళనకారులూ తమకు సహకరించాలని ఆయన కోరారు. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం అర్థరాత్రి నుంచి దాచేపల్లిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.