రాజధాని రైతులకు అండగా నిలుద్దాం: బీజేపీ, జనసేనల నిర్ణయం
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలవాలని జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.
అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలవాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి. మంగళవారం ఉదయం విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో ఉభయ పార్టీలు పోరాటం చేయాలని సంకల్పించాయి.అమరావతి ప్రస్తుత దుస్థితికి నాడు అధికారంలో ఉన్న టీడీపీ, నేడు అధికారంలో ఉన్న వైసీపీలు రెండూ బాధ్యులే అని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది.
రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని అధికార వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈ సమావేశం తెలిపింది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ రెండు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. మరో వైపు శాసనమండలిని రద్దు చేయడంపై ఈ కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది.
బిల్లు ఆగిపోయిందని మండలిని రద్దు చేస్తారా: వైసీపీపై పవన్ ఫైర్
ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని వైసీపీ, టీడీపీలపై ఈ రెండు పార్టీల నేతలు పరోక్ష విమర్శలు చేశారు.
బిజెపీ – జనసేన పార్టీలు కలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరువాత కమిటీని ఎంపిక చేయనున్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నుంచి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి,సోము వీర్రాజు, శ్రీమతి శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్కందుల దుర్గేష్, సిహెచ్.మధుసూదన్ రెడ్డి, వి.గంగులయ్య, బి.శ్రీనివాస్ యాదవ్, బి.నాయకర్ సి.మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.