వైఎస్ వివేకా కేసు: సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏపీ సర్కార్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టులో ఏజీ వాదించారు. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కావొచ్చిందన్నారు.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన నాలుగు వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు గురువారం నాడు విచారించింది. సిట్ విచారణకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో హైకోర్టుకు ఏజీ అందించారు.
Also read: వైఎస్ వివేకా కేసు: సీబీఐకి అప్పగింతకు అభ్యంతరాలున్నాయా హైకోర్టు ప్రశ్న
ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను సోమవారం నాటికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
సిట్ విచారణ పూర్తి కాబోతోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ తేల్చి చెప్పారు. ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
సిట్ విచారణపై తమకు నమ్మకం ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తేల్చి చెప్పారు. విచారణ కూడ చివరి దశలో ఉందన్నారు. అదే సమయంలో ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కూతురు సునీతారెడ్డి, భార్యతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నాలుగు పిటిషన్లపై కోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.