‘దాచేపల్లి నిందితుడు.. వైసీపీ కార్యకర్తే’
తేల్చి చెప్పిన మంత్రి చినరాజప్ప
దాచేపల్లి అత్యాచార ఘటన నిందితుడు రామ సుబ్బయ్య వైసీపీ కార్యకర్తేనని ఏపీ ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప అన్నారు. దాచేపల్లిలో 9 ఏళ్ల చిన్నారిపై రామ సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో.. నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే రోజా మహిళా సంఘాలతో కలిసి శుక్రవారం ఉదయం ధర్నా కూడా చేశారు. కాగా.. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప స్పందించారు.
దాచేపల్లి ఘటనను .. జగన్ రాజకీయం చేయాలనుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు. నిందితుడు సుబ్బయ్య వైసీపీ కార్యకర్త అని ఇప్పుడు తేలిందని.. మరి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.