దొంగస్వాముల ముసుగులో రూ.18 వేలకు టోకరా (వీడియో)

Oct 7, 2019, 5:31 PM IST

ప్రజల మూఢనమ్మకాలను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుని వారిని నిలువునా దోపిడి చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో దొంగ స్వాముల ముసుగులో ఓ వివాహితను ముగ్గురు బురిడి కొట్టించారు. వీరులపాడు గూడెం మాధవవరం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు అయ్యప్పస్వామి వేషాలతో భిక్షాటనకు వచ్చారు.

ఈ క్రమంలో ఓ ఇంట్లోకి వెళ్లి మీ ఇంటి మీద నరఘోష ఉందని మీ చిన్నారి త్వరలోనే అనారోగ్యానికి గురవుతుందని చెప్పారు. తమతో పూజలు చేయించుకుని తాయత్తులు ఇస్తే మీ ఇంటి మీద ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మబలికారు.

దీంతో భయపడినపోయిన సదరు వివాహిత వారు చెప్పినట్లు చేసింది. రూ.18 వేలను ఇచ్చి వారి వద్ద నుంచి రెండు తాయత్తులు తీసుకుంంది. డబ్బు ముట్టిన వెంటనే వారు బైక్‌పై పారిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు దొంగ స్వాముల బైక్‌ను వెంబడించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్సై ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దొంగ స్వాముల కదలికను కనిపెట్టారు. జి.కొండరు ప్రాంతంలో ముగ్గురు స్వాములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.