నడిరోడ్డుపై సామాన్యున్ని చితకబాది... జగిత్యాలలో యూత్ కాంగ్రెస్ నేతల వీరంగం

Dec 5, 2022, 4:39 PM IST

జగిత్యాల : తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ పార్టీ (టిపిసిసి) పిలుపుమేరకు ఇవాళ(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీశ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తితో కాంగ్రెస్ నాయకులకు చిన్న గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన యూత్ కాంగ్రెస్ నాయకులు సహనం కోల్పోయి అతడికి రోడ్డుపైనే పట్టుకుని చితకబాదారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని సదరు వ్యక్తిని కాపాడి అక్కడినుండి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. 

కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై వెళుతున్న తనతో అకారణంగా గొడవపెట్టుకుని కొట్టారని బాధితుడు తెలిపాడు. భర్తను పట్టుకుని కొడుతుంటే అక్కడేవున్న మహిళ బోరున విలపించడం తప్ప ఏం చేయలేకపోయింది. పోలీసులు లేకుంటే తనను మరింతగా కొట్టేవారని... వారు రావడంవల్లే స్వల్ప గాయాలతో బయటపడినట్లు బాధితులు తెలిపాడు.