జువెల్లరీ షాప్ యజమానిపై కాల్పులు... బంగారాన్ని దోచుకెళ్లిన దుండగులు

Dec 2, 2022, 10:25 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గత రాత్రి కాల్పుల కలకలం రేగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ జువెల్లరీ షాప్ లోకి మారణాయుధాలతో చొరబడ్డ దుండగులు యజమానిపై కాల్పులకు తెగబడి బంగారాన్ని దోచుకుని వెళ్లారు. ఈ దొంగతన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. నాగోల్ స్నేహపురి కాలనీలో మహదేవ్ జువెల్లరీ షాప్ లోకి తుపాకులతో చొరబడ్డారు దుండగులు. వస్తూనే జువెల్లరీ యజమాని కళ్యాణ్ ను బెదిరించి కాల్పులకు దిగారు. దీంతో అతడు రక్తపుమడుగులో పడిపోగా షాప్ లోని బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తుపాకీ చప్పుడు విని చుట్టుపక్కల షాప్ ల వారు చేరుకునే సరికే దుండగులు అక్కడినుండి పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన షాప్ యజమానిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ఈ దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు జువెల్లరీ షాప్ ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. షాప్ లోని సిసి కెమెరాల్లో ఈ కాల్పులు, దోపిడీ దృశ్యాలు నమోదయ్యాయి. వాటి ఆధారంగా దుండగులను గుర్తించేప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.