కరీంనగర్ లో దారుణం... ఇంట్లోకి చొరబడి తల్లీబిడ్డలపై కత్తులతో దాడి

Oct 7, 2022, 2:09 PM IST

కరీంనగర్ : మగదిక్కు లేకుండా జీవిస్తున్న తల్లీబిడ్డలపై ఇంట్లోకి చొరబడి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో కూతురు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

తిమ్మాపూర్ కు చెందిన గుజ్జుల సులోచన(45) ఇరవయ్యేళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా మారింది. దీంతో తల్లి రాధవ్వ(75)తో కలిసి పుట్టింట్లోనే వుంటోంది. అయితే గత అర్థరాత్రి తల్లీబిడ్డలు ఇంట్లో గాఢనిద్రలో వుండగా కత్తులతో ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సులోచన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రాధవ్వ తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో వున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.