స్టీల్ ప్లాంట్ తరహాలోనే... బిహెచ్ఈఎల్, బీడిఎల్ ప్రైవేటీకరణ: మంత్రి హరీష్ సంచలనం

Mar 5, 2021, 12:11 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ శంషాబాద్ లోని ఓ ఆడిటోరియంలో పట్టభద్రుల ఓటర్లతో టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్,‌ ఎమ్మెల్సీ ‌దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... విభజన చట్టంలో‌ పేర్కోన్న బయ్యారం ఉక్కు , రైల్వే‌కోచ్ ఫ్యాక్టరీ వంటివి ఇస్తామని కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ఇవ్వలేదన్నారు. వీటి సాధనకు ఈ ఏడేళ్లలో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏం‌ చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ లో‌  50 శాతం ఉద్యోగులను తొలగించారన్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని...  తెలంగాణలో ‌కూడా బీహెచ్ఈఎల్, బీడిఎల్ వంటి వాటిని ప్రయివేటు‌పరం చేస్తారని ఆరోపించారు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్న విషయంపై ఉద్యోగులు ఆలోచించాలని హరీష్ రావు సూచించారు.