హైదరాబాద్ రెండో దశ మెట్రో... కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Dec 6, 2022, 5:21 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 9న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ లో ముఖ్యమంత్రి రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజేంద్ర నగర్ లోని పోలీస్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభను భారీఎత్తున నిర్వహించాలని భావిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఇవాళ పరిశీలించారు.  

హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఉద్యోగుల సౌకర్యార్థం మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తం 31 కిలోమీటర్ల ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 6,250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది.