పల్నాడు జిల్లాలో దారుణం... ఇంట్లోనే పూలవ్యాపారి దారుణ హత్య

Nov 29, 2022, 4:27 PM IST

సత్తెనపల్లి : ఇంట్లో భార్యపక్కన పడుకున్న వ్యక్తి అర్ధరాత్రి రక్తపుమడుగులో పడి శవంగా మారిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడికి చెందిన షేక్ శిలార్ పూలవ్యాపారి. రోజూ మాదిరిగానే సోమవారం కూడా పూలవ్యాపారం ముగిసాక ఇంటికి చేరుకున్న అతడు రాత్రి భార్యతో కలిసి ఇంటి వరండాలో నిద్రించాడు. ఏమయ్యిందో తెలీదుగాని అర్ధరాత్రి భార్యకు మెలకువ రాగా మెట్లవద్ద భర్త రక్తపుమడుగులో పడివుండటం గమనించింది. దీంతో కంగారుపడిపోయిన ఆమె ఇంట్లో పడుకున్న కొడుకు, కోడలిని నిద్రలేపింది. అందరూ కలిసి వెళ్లిచూడగా అప్పటికే శిలార్ ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించాడు. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.