ఇక్కడి దోచుకుంది చాలదా..? డిల్లీలో లిక్కర్ బేరాలా..: కేసీఆర్ కుటుంబంపై ఈటల ఫైర్

Dec 1, 2022, 4:53 PM IST

హైదరాబాద్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకై ప్రాణత్యాగానికి పాల్పడిన అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా గల గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఈటల నివాళి అర్పించారు. కిష్టయ్య అమరత్వాన్ని గుర్తుచేసుకోవాలని తెలంగాణ ప్రజలకు ఈటల సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈటల తీవ్ర విమర్శలు చేసారు. స్వరాష్ట్రంలో కొద్దిమంది ప్రజల్ని దోచుకుని సంపాదించుకునే పరిస్థితి వుందని... అనేకమంది కనీస అవసరాలకు కూడా నోచుకోవడం లేదన్నారు. ఇక్కడ దోపిడీ చాలదన్నట్లుగా డిల్లీకి పోయి లిక్కర్ బేరం చేసారంటూ ఆరోపించారు. ధరణి పేరిట వేలాది ఎకరాలు చెరబట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2014 ముందు ఉపాసముండి ఉద్యమం చేస్తే... 2014 తర్వాత వేలకోట్ల పడగలెత్తి ఓట్లను కొనే పరిస్థితి వచ్చారన్నారు. సొంత గాలిమోటర్ కొంటానని, ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కు వందలకోట్లు తాత సొమ్ములాగా ఖర్చుచేస్తున్నారని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.