పల్నాడులో విషాదం... లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడి బలి

Sep 9, 2022, 12:30 PM IST

అమరావతి : ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులకు ఆంధ్ర ప్రదేశ్ లో మరో యువకుడు బలయ్యాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శివరాత్రి శివ(20) వ్యక్తిగత అవసరాల కోసం ఆన్ లైన్ యాప్ ద్వారా 8వేల రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో నిర్ణీత సమయానికి డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో భారీగా ఫైన్ విధించి మొత్తం రూ.20వేలు చెల్లించాలని లోన్ యాప్ సిబ్బంది వేధించడం ప్రారంభించారు. ఇటీవల లోన్ యాప్ వేధింపులు మరీ మితిమీరిపోవడంతో శివ భరించలేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. గత రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గుర్తించేసరికే శివ మృతిచెందాడు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు ఆత్మహత్యకు కారకులైన లోన్ యాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు.