వివేకా హత్యపై టిడిపి ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు...రాజకీయ స్వార్థంతోనే చంపారని ఆరోపణ...

Apr 19, 2023, 5:01 PM IST

అమరావతి : వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలతో పాటు త్వరలోనే విశాఖలో కాపురం పెడతానన్న సీఎం జగన్  వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ను విశాఖపట్నంలో కాపురం పెట్టమని విజయ్ కుమార్ స్వామి చెప్పారా లేక స్వరూపానంద స్వామి చెప్పారా? అని అనురాధ ప్రశ్నించారు. ఆయన ఎక్కడ కాపురం పెడితే అక్కడ అక్రమాలకు పాల్పడతారు... కానీ విశాఖలో కాపురం పెట్టకముందే అక్రమాలకు  పాల్పడ్డారని అన్నారు. ఇక అక్కడే కాపురం పెడితే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ అనురాధ ఆందోళన వ్యక్తం చేసారు. ఇక వివేకా హత్య కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అనురాధ రియాక్ట్ అయ్యారు. సొంత బాబాయ్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నాలుగేళ్లలో లక్ష అబద్దాలతో కాలం గడిపారని అన్నారు. ఓ కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ వివేకా హత్యపై జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అనురాధ గుర్తుచేసారు. మరి ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ గురించి ఏమాంటారు అని ప్రశ్నించారు.  జగన్ ఆండ్ కో నటన ఆస్కార్ స్థాయిలో వుందని అనురాధ ఎద్దేవా చేసారు. కేవలం తన రాజకీయ స్వార్థంతో  పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలుకు న్యాయం చేస్తాడా అని నిలదీసారు.