అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత... అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన తెలుగు రైతులు

Sep 19, 2022, 1:54 PM IST

అమరావతి : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపి వ్యవసాయం, రైతు సమస్యలపై ఆందోళనకు దిగడంతో రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీకి నారా లోకేష్ సహా టిడిపి శాసనసభా పక్షం ఎడ్లబండి తీసుకుని వెళ్లడం... ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త శాంతించగానే తెలుగు రైతు నాయకులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డులతో అసెంబ్లీ వైపు దూసుకువచ్చిన రైతు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తెలుగు రైతులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో రైతు ప్రతినిధులను పోలీసులు చేతులు, కాళ్లు పట్టుకుని ఎత్తుకెళ్లి పోలీస్ వాహనంలో, ఆటోల్లో అక్కడినుండి తరలించారు.