నేడు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ...

Oct 5, 2022, 11:03 AM IST

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల్లో చివరిరోజయిన ఇవాళ (బుధవారం) విజయవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దసరా పండగ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు, భవాని దీక్షదారులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు నిండిపోయి అమ్మవారి దర్శనానికి సమయం పడుతోంది. నవరాత్రి వేడుకల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. ఇలా ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న బాలయ్యకు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం చేయించిన అధికారులు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందించగా... పండితులు వేద ఆశీర్వచనం అందించారు.