సింహాచలం ఆలయంలో కార్తీక శోభ... దీపాల వెలుగులో మెరిసిపోతున్న వరాహపుష్కరిణి

Nov 24, 2022, 1:46 PM IST

విశాఖపట్నం : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసం ఇవాళ్టితో పూర్తవనున్న నేపథ్యంలో ప్రాచీన సింహాచలం లక్ష్మీనరసింహస్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పోలు పాడ్యమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి కుటుంబసమేతంగా చేరుకున్న మహిళలు అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి వరాహ పుష్కరిణిలో వదిలారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా తెల్లవారుజాము నుండే సింహాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ముగింపు రోజు భారీగా భక్తుల రాకను ముందుగానే గుర్తించిన సింహాచలం ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేసారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీపారాధన కోసం పుష్కరిణి వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అప్పన్న నామస్మరణతో సింహాచలం ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది.