ఉగాదికి అలా... గుడ్ ప్రైడేకు ఇలా... జగన్ రెడ్డి పండగ కానుకలివేనా..?: దేవినేని ఉమ సెటైర్లు

Apr 15, 2022, 10:07 AM IST

విజయవాడ: వైసిపి ప్రభుత్వం పండగలపూట ప్రజలపై భారం మోపడం దారుణమని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గతంలో పెంచిన విద్యుత్‌ చార్జీలు, ప్రస్తుతం పెంచిన ఆర్టిసి చార్జీలు తగ్గించాలని కోరుతూ ఆయన వినూత్న నిరసన తెలిపారు. గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. బస్సులోని మహిళా ప్రయాణికులకు ఆర్టిసి చార్జీల పెంపు, దానివల్ల సామాన్యులపై ఎంత భారం పడనుందో వివరించారు. 

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు.  చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇస్తే... వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ బాదుడు బాదేస్తున్నారన్నారు. ఇవాళ గుడ్‌ ఫ్రైడే రోజున ఆర్టీసీ చార్జీలు, గతంలో ఉగాది రోజున విద్యుత్‌ చార్జీలు పెంచారని గుర్తుచేసారు. ఈ బాదుడు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని దేవినేని ఉమ స్పష్టం చేసారు.