డాలర్ శేషాద్రి వర్సెస్ రమణదీక్షితులు: జగన్, వైవీ సుబ్బారెడ్డిలకు బద్రి ట్వీట్

By telugu teamFirst Published Jul 20, 2020, 11:45 AM IST
Highlights

డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై దుష్ప్రచారం ప్రారంభమైంది. డాలర్ శేషాద్రికి కరోనా వైరస్ సోకిందని బద్రి అనే వ్యక్తి జగన్, వైవీ సుబ్బారెడ్డిలకు ట్వీట్ చేశాడు. ఆయన రమణదీక్షితులు అనుచరుడు.

తిరుపతి: తిరుమల శ్రీవారి గౌరవ ప్రధానార్చకుడు రమణదీక్షితులుకు, డాలర్ శేషాద్రికి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై దుష్ప్రచారం ప్రారంభమైంది. బద్రి అనే వ్యక్తి డాలర్ శేషాద్రికి కరోనా వైరస్ సోకిందంటూ ట్వీట్ చేశారు.

డాలర్ శేషాద్రికి కరోనా సోకిందని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్వీట్ చేశారు. బద్రి రమణదీక్షితులకు ప్రధాన అనుచరుడనే అభిప్రాయం ఉంది. తనకు కరోనా సోకిందంటూ బద్రి చేసిన ట్వీట్ మీద డాలర్ శేషాద్రి టీటీడీకి ఫిర్యాదు చేశారు. 

ఇదిలావుంటే, తిరుమలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు శ్రీనివాస దీక్షితులు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కోరనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. 

ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా విజృంభణ కారణంగా ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. 

ఇదిలావుంటే, శ్రీవారి ఆలంయలోని పెద్ద జియ్యంగారికి కరోనా వైరస్ సోకింది. ఇ్పపటి వరకు 170 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 18 మంది అర్చకులకు, 100 మంది సెక్యురిటీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

20 మంది పోటు సిబ్బందికి, కల్యాణకట్టలోని ఇద్దరికి కోరనా వైరస్ సోకింది. తిరుమలలోని పరిస్థితిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు. ఈ పరిస్థితిలో శ్రీవారి దర్శనాలను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమణదీక్షితులు దర్శనాల కొనసాగింపును తప్పు పట్టారు. 

తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడిగా శ్రీనివాస దీక్షితులు 20 ఏళ్లకు పైగా పనిచేశారు. కరోనా బారిన పడి మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేని పరిస్థితి ఏర్పడింది.

click me!