తెలంగాణాలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు: నిన్నొక్కరోజే 61

By Sree sFirst Published Apr 14, 2020, 7:02 AM IST
Highlights

తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమ వారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదు అవడం తెలంగాణాలో వైరస్ చాపకింద నీరులా ఎలా వ్యాపిస్తుందో సూచిస్తోంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 592 కి చేరింది. 

తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమ వారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదు అవడం తెలంగాణాలో వైరస్ చాపకింద నీరులా ఎలా వ్యాపిస్తుందో సూచిస్తోంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 592 కి చేరింది. 

నిన్న ఒకరు మృతిచెందడంతో.... రాష్ట్రంలో మరణాల సంఖ్య 17కి చేరుకుంది. 103 మం ది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యా రు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ నిన్న రాత్రి హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. 

రాష్ట్రంలోని 28 జిల్లా ల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు ఉండగా.. ఆ తరువాత స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉంది. వికారాబాద్, వరంగల్‌ అర్బన్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, మేడ్చల్, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జంటనగరాల పరిధిలో అత్యధికంగా 216 కేసులు ఆక్టివ్ గా ఉండడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. 

ఇక నిన్నతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదును 17 యూనిట్లుగా విభజించాలని ఆయన సూచించారు. ఒక్కో యూనిట్ గా రెవెన్యూ, మున్సిపల్, వైద్య, రెవెన్యూ అధికారులను నియమించాలని ఆయన సూచించారు. జోన్లుగా విభజించి ప్రత్యేకాధికారని నియమించాలని ఆయన సూచించారు. 

కంటైన్మెంట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్లలోంచి ప్రజలెవరూ బయకు రావద్దని సూచించారు. రోజుకు 1000 నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా ల్యాబ్ లు ఉండాలని చెప్పారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. 

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

click me!