సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు

By telugu teamFirst Published Dec 14, 2019, 5:02 PM IST
Highlights

సమతపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు శనివారంనాడు ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. డిఎన్ఎ పరీక్షల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి, వారిపై అభియోగాలు మోపారు.

ఆదిలాబాద్: సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు శనివారంనాడు ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 140 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఎ1 షేక్ బాబు, ఏ2 షాబుద్దీన్, ఏ3 షేక్ ముగ్దుమ్ లను నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఆ చార్జీషీట్ దాఖలు చేశారు. 

సమత కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సమతపై అత్యాచారం చేసి గొంతు కోసి ఆమెను చంపేశారని ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లో నిర్ధారించారు. చార్జిషీట్ లో ఫోరెన్సిక్ నివేదికను పొందుపరిచారు. డిఎన్ఎ పరీక్షల ద్వారా నిందితులను గుర్తించినట్లు, హతురాలి చీరెపై ఉన్న స్మెర్మ్ తో వారిని గుర్తించడం సాధ్యమైందని అంటున్నారు. 

Also Read: దిశ ఎఫెక్ట్: సమత కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

సమత కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం నుంచి విచారించనుంది. నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. సమత కేసును పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 

నిందితులకు న్యాయ సాయం చేయకూడదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు సమత కుటుంబ సభ్యులను జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పారండే పరామర్శించారు. దిశ, సమత కేసుల్లో కుల వివక్ష ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

click me!