
Telangana: తెలంగాణలో ఏప్రిల్ 13 న ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రాణహిత నదిలో స్నానాలు చేసేందుకు, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు.
ఈ పుష్కర ఉత్సవాలు ఎలాంటి ఆటంకం లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగినన్ని నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం తక్షణమే యుద్ధప్రాతిపదికన అన్ని పౌర సదుపాయాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహితలో తొలి పుష్కరాలు ఇవే. యాత్రికులకు పౌరసౌకర్యాలు కల్పించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేక దృష్టి సారించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
అంతకుముందు, పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కరోనావైరస్ మహమ్మారి దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా ఇతర దేశాల్లో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇక ప్రస్తుం రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోందనీ, దాని ప్రభావం యావత్ యావత్ ప్రపంచంపై పడిందని తెలిపారు. వీటికి తోడు తీవ్రవాదం సైతం మానవాళి మనుగడకు సవాళుగా మారిందని చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు సమస్యలు భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ప్రజలను బాధపెడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మూడు సమస్యలతో బాధపడుతున్నారని ఆయన అన్నారు.
ఏప్రిల్ 13 నుంచి ప్రాణహిత తొలి పుష్కరాలు !
ప్రాణహిత పుష్కరాలను ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత పుష్కరాలు తొలిసారిగి నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో 2010లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలను నిర్వహించారు. అయితే, రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో వీటిని నిర్వహించారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణాహిత పుష్కరాలు నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ సైతం ఈ పుష్కరాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారనీ, ఇప్పటికే అధికారులకు సంబంధిత విషయాలపై ఆదేశాలు అందాయని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాాగా, ప్రాణహిత పుష్కరాలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశముంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.