రామోజీ రావు అసలు పేరేంటో తెలుసా..? మరి ఈ పేరెలా వచ్చింది..?

By Arun Kumar PFirst Published Jun 8, 2024, 8:47 AM IST
Highlights

ఎక్కడో కృష్ణా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో పుట్టిపెరిగిన రామోజీ రావు ఈ స్థాయికి ఎలా వచ్చారు..?  ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు..?  ఆయన వ్యక్తిగత జీవితం ఎలా సాగింది..?...

హైదరాబాద్ : రామోజీరావు ... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈనాడు గ్రూప్స్ ఛైర్మన్ గా, వ్యాపార దిగ్గజంగా రామోజీరావు అందరికీ సుపరిచితమే. కొందరికి సినీ నిర్మాతగా తెలుసు. ఇలా మనందరికి రామోజీ రావుగానే ఆయన పరిచయం... కానీ ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది కాదట..!! తన పేరును రామోజీ రావుగా ఆయనే స్వయంగా మార్చుకున్నారట... ఆ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిపోయింది.  

రామోజీరావు పేరు మార్పు స్టోరీ :  

Latest Videos

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో నవంబర్ 16, 1936 లో వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులను మగబిడ్డ పుట్టాడు. దీంతో తన తండ్రే మళ్ళీ కొడుకుగా పుట్టాడని సుబ్బారావు సంబరపడిపోయాడు... అందువల్లే కొడుకుకు తండ్రి రామయ్య అని పేరుపెట్టుకున్నాడు. ఆ రామయ్యే ఇప్పుడు మనందరికి సుపరిచతమైన రామోజీరావు. 

అయితే స్కూల్ డేస్ లో ఎందుకో మరి రామయ్య అన్న పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో ఆలోచించి చివరకు రామయ్య పేరును 'రామోజీరావు' గా మార్చుకున్నాడు. ఆ తర్వాత రామోజీరావుగానే అతడు ప్రపంచానికి పరిచయం అయ్యారు. 

రామోజీరావు వ్యక్తిగత జీవితం : 

రామోజీరావు పూర్వీకులది పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామం. అక్కడినుండి ఆయన తాత రామయ్య పెదపారుపూడికి వలస వెళ్లారు. రామోజీ రావు అక్కడే జన్మించారు. అతడికి  రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తోబుట్టువులు.  ఒక్కడే మగపిల్లాడు కావడంతో తల్లిదండ్రులు సుబ్బారావు, వెంకటసుబ్బమ్మ రామోజీరావును అల్లారుముద్దుగా చూసుకునేవారు. 

రామోజీ రావు ప్రాథమిక విద్యాభ్యాసం స్వస్థలంలోనే ముగిసింది... ఉన్నత విద్యాభ్యాసం గుడివాడలో సాగింది. ఆయన బిఎస్సి చదివారు. చదువు పూర్తయ్యాక డిల్లీలో మూడేళ్ళపాటు అడ్వర్టైజింగ్ ఏజన్సీలో పనిచేసారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 

ఉద్యోగం చేస్తుండగానే రామోజీరావుకు పెనమలూరుకు చెందిన రమాదేవితో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాతే డిల్లీ నుండి హైదరాబాద్ కు మకాం మార్చారు రామోజీరావు. ఇక ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న ఆయన మొదట మర్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మీడియా రంగంలో అడుగుపెట్టారు. 

వ్యాపార జీవితం : 

మార్గదర్శి చిట్ ఫండ్ మంచి లాభాల్లో కొనసాగడంతో రామోజీరావు ఇక వెనుదిరిగి చూడలేదు. 1962లో మార్గదర్శిని ప్రారంభిస్తే మూడేళ్ళకే అంటే 1965లో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజన్సీ ప్రారంభించారు. ఆ తర్వాత వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం ప్రారంభించారు. ఇలా అనేక వ్యాపారాలు చేస్తునే మీడియా రంగంలోకి దిగారు. 

1969లో రామోజీరావు వ్యవసాయ సమాచారం కోసం అన్నదాత మ్యాగ జైన్ ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుండటంతో అన్నదాతకు రైతుల నుండి ఆదరణ లభించింది. దీంతో ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయని గుర్తించిన రామోజీరావు  ఈనాడు దినపత్రిక, ఈటివి ని ప్రారంభించారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నిర్మాతగా మారారు.  

తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చిన సమయంలో సినిమాల నిర్మించేందుకు ఇబ్బందిపడేవారు. ఇది గుర్తించిన రామోజీరావు హైదరాబాద్ శివారులు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. వందలాది ఎకరాల్లో సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ ఫిల్మ్ సిటీ  భారత సినీరంగ ముఖచిత్రాన్నే మార్చేసింది. అన్ని సౌకర్యాలు ఒకేచోట వుండటంతో పిల్మ్ సిటీలో సినిమాల నిర్మాణం పెరిగిపోయింది... దీంతో రామోజీరావు ఈ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యింది. 

రామోజీరావు మృతి :  

ఇలా సినీ, వ్యాపారం రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జాతీయస్థాయిలో గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి  87 ఏళ్ల వయసులో ఇవాళ కన్నుమూసారు. ఆయన మృతి మీడియా, సినీ,వ్యాపార రంగానికి తీరనిలోటు. 

click me!