
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో (jubilee hills police station) ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఎస్పీ , అడిషనల్ డీసీపీ, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు చర్చిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి బయటకు వస్తోన్న వీడియోలు , ఫోటోల లీకేజ్పై ఆరా తీస్తున్నారు అధికారులు. మరోవైపు రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ (telangana home minister mahmood ali ) . పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితులు మైనర్లు కావడం వల్లే విచారణ ఆలస్యమైందని హోంమంత్రి పేర్కొన్నారు. తనపై వస్తోన్న ఆరోపణలు అబద్ధాలు అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ.
అంతకుముందు .. అమ్నేషియా పబ్ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియాను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు నిందితులు వైపా..?, బాధితుల వైపా..? అని ప్రశ్నించారు. పోలీసులకు ధైర్యం ఉంటే.. తప్పుచేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తి కాకముందే కొందరికి క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్గా ఉంచారని ప్రశ్నించారు. నిర్బయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్నవారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు.
Also read:ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా?.. అన్ని ఆధారాలు ఉన్నాయి: బాలిక అత్యాచార ఘటనపై రఘునందన్ రావు
పోలీసులు అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ.. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరని అన్నారు. ఎంఐఎం వాళ్లను కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కలర్ మెర్సిడెజ్ కారులో ఉన్న వ్యక్తులను నిందితులుగా చేర్చకుండా.. వెనకాల ఇన్నోవాలో ఉన్నవారిని నిందితులుగా చేర్చడం బాధకరమని అన్నారు. ఇన్నోవా కారులో ఉన్నవారిని ముద్దాయిలుగా చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరతామని అన్నారు.
అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడుకు బాలికపై అత్యాచారం చేశాడని చెప్పారు. కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. కానీ లిమిటేషన్ దృష్ట్యా ప్రపంచానికి ఎంతవరకు చూపించాలో తనకు తెలుసని అన్నారు. కొన్ని ఫొటోలను రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే అమ్మాయి ఫొటో కనిపించకుండా ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని చెప్పారు. ‘‘అమ్మాయి కన్సెంట్ ఇచ్చిందని అనవచ్చు.. ఒకవేళ కన్సెంట్ ఇచ్చిన మైనర్ కన్సెంట్ వ్యాలిడ్ అవుతుందా..?’’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.