దేశీయ విమానయానం చేసే వారి కోసం ఆన్ లైన్ రిటైల్ సంస్థ ‘అమెజాన్’ ఫ్లైట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ‘క్లియర్ ట్రిప్’ యాప్ను ప్రారంభించింది.
బెంగళూరు: ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ సరికొత్త సేవలను భారత్లో ప్రారంభించింది. ఇక నుంచి అమెజాన్ దేశీయ విమాన టికెట్లను బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పటికే షాపింగ్, నగదు బదలాయింపు, బిల్లుల చెల్లింపు, మొబైల్ రీఛార్జీ వంటి సేవలను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.
తమ ద్వారా విమాన ప్రయాణానికి టిక్కెట్ బుక్ చేసుకొన్న వారు తర్వాత అనివార్య పరిస్థితుల్లో టికెట్లను రద్దు చేస్తే అదనంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని అమెజాన్ పేర్కొంది. కేవలం విమానయాన సంస్థ విధించే పెనాల్టీలు మాత్రం చెల్లిస్తే చాలని తెలిపింది.
అన్ని రకాల సేవల కోసం ముంబై కేంద్రంగా పని చేస్తున్న ‘క్లియర్ట్రిప్’అనే ట్రావెల్ సంస్థతో కలిసి అమెజాన్ యాప్ను ప్రారంభించింది. ‘మేం క్లియర్ ట్రిప్తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా కస్టమర్లకు అత్యున్నత శ్రేణి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెజాన్ యాప్ వినియోగదారులకు, ప్రైమ్ సభ్యత్వం తీసుకొన్నవారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది’అని అమెజాన్ పే డైరెక్టర్ షరీక్ తెలిపారు.
అమెజాన్ మొబైల్ యాప్, వెబ్ సైట్లలోని ‘అమెజాన్ పే పేజీ’లో ఫ్లైట్స్ ఐకాన్ చూడవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ‘మా కస్టమర్లకు దేశీయ విమానయానానికి టిక్కెట్ల బుకింగ్ సర్వీస్ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అమెజాన్ పే డైరెక్టర్ షరీక్ చెప్పారు.
విమాన టిక్కెట్ల కొనుగోలులోనూ అమెజాన్ తమ కస్టమర్లకు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తున్నది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు రాయితీలు అందిస్తోంది.
అమెజాన్ ద్వారా ‘ఈ-కామర్స్’, సమగ్ర పేమెంట్ ‘యాప్’అందుబాటులోకి రావడంతో దేశీయ విమానయానానికి వెసులుబాటు లభించనున్నది.
ఈ నెలాఖరు వరకు ‘క్లియర్ ట్రిప్’ లాంచింగ్ పీరియడ్ అమలులో ఉంటుంది. ఈ కాలంలో కస్టమర్లందరికీ రూ.1600, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు రూ.2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. క్లియర్ ట్రిప్ భాగస్వామ్యంతో అమెజాన్ పొజిషన్ మెరుగవుతుంది. అలాగే ఈ రంగంలో పోటీ సంస్థలు.. మైక్ మై ట్రిప్, పేటీఎం, యాత్ర, గూగుల్, ఈజ్ మై ట్రిప్, బుకింగ్ డాట్ కామ్ లతో అమెజాన్ పోటీ పడుతుంది.
2018 ఏప్రిల్ నుంచే ఇండియన్ ఈ కామర్స్ మేజర్ ‘ఫ్లిప్ కార్ట్’.. గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న మేక్ మై ట్రిప్ సంస్థతో కలిసి పని చేస్తోంది. గత నెలలో ముంబై కేంద్రంగా పని చేస్తున్న క్వెస్ట్ 2 ట్రావెల్ ఇండియా సంస్థను టేకోవర్ చేసింది. దీంతో కార్పొరేట్ ట్రావెల్ స్పేస్లో మేక్ మై ట్రిప్ సంస్థ పురోగతి సాధించేందుకు వెసులుబాటు కలిగించింది.