అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు గట్టి ఎదురు దెబ్బ

By Rekulapally SaichandFirst Published Oct 22, 2019, 4:00 PM IST
Highlights

కొన్నేళ్లుగా ఈ-కామర్స్ బిజినెస్ దిగ్గజాలు ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను హోరెత్తిస్తున్న అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సంస్థల నిర్వహణతోపాటు వస్తువుల కొనుగోలుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వచ్చింది, నిల్వల మాటేమిటి? మీ విక్రయాల్లో ఐదు అగ్రశ్రేణి విక్రేతలెవరో చెప్పాలని అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లను డీపీఐఐటీ ఆదేశించింది.తమ ప్రశ్నావళికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

న్యూఢిల్లీ: ఈ -కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు ఎదురుదెబ్బ తగిలింది. సదరు సంస్థలు ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలు వెల్లడించాల్సిందేనని డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌ ప్రమోషన్‌‌ ఆఫ్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌ (డీపీఐఐటీ) స్పష్టం చేసింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు పలు ప్రశ్నలు సంధించింది. టాప్‌‌-5 సెల్లర్లు, మూలధన సేకరణ, ఇన్వెంటరీ వంటి వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. 

ప్రిఫర్డ్‌‌ సెల్లర్స్‌‌ వస్తువుల ధరలు, వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు గురించి కూడా వెల్లడించాల్సిందేనని ఈ కామర్స్ దిగ్గజాలకు డీపీఐఐటీ స్పష్టం చేసింది. మూలధనం ఎలా, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ? బిజినెస్‌‌ మోడల్‌‌ ఏంటి ? ఇన్వెంటరీని ఎలా నిర్వహిస్తున్నారు ? వంటి ప్రశ్నలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఒక ప్రశ్నాపత్రాన్ని అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు డీపీఐఐటీ పంపింది.

also readజియో వినియోగదారులకు కొత్త రీచార్జ్‌ ప్లాన్లు...ఉచితంగా...

మెగా ఫెస్టివ్‌‌ సేల్స్‌‌తో పేరుతో ఈ రెండు ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐల) నిబంధనలకు వ్యతిరేకంగా వహరిస్తున్నాయని, విపరీతంగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని రిటైల్‌‌ వ్యాపారం సంఘం సీఏఐటీ పలుసార్లు ఫిర్యాదు చేయడంతో డీపీఐఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై వివరణ కోసం అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లను ఈ–మెయిల్‌‌ ద్వారా సంప్రదించగా స్పందన రాలేదు.

ఇదిలా ఉంటే అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తున్నాయనే ఆరోపణలపై విచారణ జరుగుతుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్‌‌ గోయల్‌‌ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ ప్రకారం ఈ–కామర్స్‌‌ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఇన్వెంటరీ మోడల్‌‌ కంపెనీలకు మాత్రం ఎఫ్‌‌డీఐలు సేకరించడం అసాధ్యం. 

తన వెబ్‌‌సైట్‌‌/యాప్‌‌ ద్వారా అమ్మే వస్తువుల ధరలను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ కంపెనీలు నియంత్రించకూడదు. మరోవైపు అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ మాత్రం తాము ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను పాటిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రత్యేకంగా డిస్కౌంట్లు ఏవీ ఇవ్వడం లేదని, బ్రాండ్లే  తమ వస్తువుల ధరలను తగ్గిస్తున్నాయని వాదిస్తున్నాయి. 

ప్రస్తుత పండగ సీజన్‌‌లో ఈ రెండు కంపెనీలు రూ.39 వేల కోట్ల అమ్మకాలు సాధించే అవకాశాలు ఉన్నాయని రెడ్‌‌సీర్‌‌ సంస్థ స్టడీ తెలిపింది. పండగల సీజన్‌‌ సందర్భంగా ఈ రెండు అమెరికా కంపెనీలు గత నెల 29 నుంచి ఈ నెల నాలుగు వరకు మెగా ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ నిర్వహించాయి. అంతేగాక అమెజాన్‌‌ ఈ నెల 21 నుంచి, ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఈ నెల 25 నుంచి మరోసారి దీపావళి సందర్భంగా ఫెస్టివల్‌‌ సేల్స్‌‌  నిర్వహిస్తున్నాయి. 

ఇండియా స్టార్టప్‌‌ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వాల్‌‌మార్ట్‌‌ 70 శాతానికిపైగా వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ కోసం వేలాది ప్రొడక్టులపై ఇవి భారీ ఆఫర్లు ఇచ్చాయి. కొన్ని కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్‌‌ అందించాయి. ఈఐఎం, క్యాష్‌‌బ్యాక్‌‌లతోనూ కస్టమర్లను ఆకర్షించాయి.

గతంలో మాదిరి నగరాలపైనే కాకుండా ఈసారి చిన్న పట్టణాలపై, గ్రామాలపై బాగా దృష్టి సారించాయి. తాము 99.6 శాతం పిన్‌‌కోడ్‌‌లకు పార్సిల్స్‌‌ పంపించగలిగామని అమెజాన్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. ముఖ్యంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌‌ విపరీతంగా అమ్ముడయ్యాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని వివరించారు. ఇందుకోసం అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్ల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. అమ్మకాల విలువను ఈ రెండు కంపెనీలూ బయటపెట్టకున్నా రికార్డుస్థాయి సేల్స్‌‌ సాధించినట్టు ప్రకటించాయి.

ఈ కంపెనీలు అనైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తున్నాయని, చిన్న వ్యాపారాలను తొక్కేయడానికి అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని  ‘కాన్ఫిడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆల్‌‌ ఇండియా ట్రేడర్స్‌‌’ (సీఏఐటీ) వాదన. సొంత కంపెనీల ద్వారా అమ్మకాలు నిర్వహించకూడదనే రూల్స్‌‌ను పట్టించుకోవడం లేదన్నది మరో ఫిర్యాదు. అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ల అమ్మకాల్లో మెజారిటీ వాటా సొంత సెల్లర్లదే అనే ఆరోపణలు ఉన్నాయి. 

also readఎస్‌యూవీ కంపాక్ట్ ఎంజీపై మనసు పడ్డ డ్రీమ్ గర్ల్

అందుకే డీపీఐఐటీ టాప్‌‌–5 సెల్లర్ల డేటా కోరినట్టు తెలుస్తోంది. మొత్తం సెల్లర్ల వివరాలూ ఇవ్వాలని ఆదేశించింది. కంట్రోల్‌‌లో ఉన్న, కంట్రోల్‌‌లో లేని సెల్లర్ల సంఖ్యను కూడా తెలపాలని డీపీఐఐటీ నిర్దేశించింది. టాప్‌‌–5 సెల్లర్ల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది.. వారి అమ్మకాల విలువను కూడా అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు వెల్లడించాలి.

ఈ రెండు సంస్థలు అమ్మే వస్తువుల పేర్లను, ధరలనూ తెలియజేయాలి. పేమెంట్‌‌ గేట్‌‌వేలతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా డీపీఐఐటీ ఆరా తీసింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో డీపీఐఐటీ ఈ–కామర్స్‌‌ కంపెనీలతోపాటు సీఏఐటీ సభ్యులతోనూ పలుసార్లు సమావేశాలు నిర్వహించింది.

click me!