సచిన్ రికార్డ్ కి చేరువలో విరాట్ కోహ్లీ

By ramya neerukondaFirst Published Oct 18, 2018, 4:16 PM IST
Highlights

వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు.  ఇప్పటికే తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటూ.. పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ.. మరో రికార్డ్ కి చేరువయ్యాడు. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో ఆరంభయ్యే వన్డే సిరీస్‌లో కోహ్లిని మరో మైలురాయి ఊరిస్తోంది. విండీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి 187 పరుగులు చేస్తే అతని ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. 

అది కూడా మాస్టర్‌ బ్లాస్టర్‌, బ్యాటింగ్‌  దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ పేరిట గత కొన్నేళ్లుగా పదిలంగా ఉన్న రికార్డు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు. ఓవరాల్‌గా విండీస్‌పై వన్డేల్లో సచిన్‌ చేసిన పరుగులు 1573. నాలుగు సెంచరీలు, పదకొండు హాఫ్‌ సెంచరీ సాయంతో విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆ  ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. విండీస్‌పై ఇప్పటివరకూ 27 వన్డేలు ఆడిన కోహ్లి నాలుగు సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలతో 1387 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లి ఈ మార్కును సునాయాసంగానే చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మిగతా భారత ఆటగాళ్లలో రాహుల్‌ ద‍్రవిడ్‌(1348), సౌరవ్‌ గంగూలీ(1142), అజహరుద్దీన్‌(998) వరుస స్థానాల్లో ఉన్నారు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా  ఆదివారం ఇరు జట్ల మధ్య గువాహటిలో తొలి వన్డే జరుగనుంది.

click me!