పెళ్లంటే నూరేళ్ల మంట కాదు.. వందేళ్ల ఆయుష్ఫు!

By telugu news teamFirst Published Jul 9, 2020, 2:47 PM IST
Highlights

ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులకు గురయిన వారిపై పరిశోధన చేయగా.. వారంతా వైవాహిక బంధానికి దూరంగా ఉన్నవారేనని తేలింది.


‘‘ వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా’’, ‘‘ భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు.. భర్తగా మారకు బ్యాచిలరు’’ ఈ పాటలు వినే ఉంటారు. పెళ్లి జరిగితే.. మగవారు కష్టాలు పడాలనే అనే అర్థం వచ్చేలా సాగే ఈ పాటలకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.

 అయితే..  పలువురు పరిశోధకులు మాత్రం..  పెళ్లంటే నూరేళ్ల ఆయుష్షు అంటున్నారు. మీరు చదివింది నిజమే.. వివాహ బంధంతో అడుగుపెట్టిన పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారు అని చెబుతున్నారు.

ఎమోరీ యూనివర్శిటీకి చెందిన పలువురు పరిశోధకులు ఈ విషయంపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధననలు చేశారు. వారి పరిశోధన ప్రకారం.. పెళ్లి అయిన వారిలో  గుండె సంబంధిత వ్యాధులు.. పెళ్లి చేసుకోని వారితో పోలిస్తే.. 52శాతం తక్కువగా వస్తాయి. అంతేకాదు.. పెళ్లికాని వారితో పోలిస్తే.. పెళ్లి చేసుకున్న వారిలో 24శాతం ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి. ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులకు గురయిన వారిపై పరిశోధన చేయగా.. వారంతా వైవాహిక బంధానికి దూరంగా ఉన్నవారేనని తేలింది. వారిలో చాలా మంది భార్య/భర్త నుంచి విడాకులు తీసుకొని ఎమోషనల్ గా ఒత్తిడి ఫీలైనవారే. మరి కొందరు భర్త లేదా భార్యని కోల్పోవడం, కొందరు అసలు వివాహమే చేసుకోని వాళ్లు ఉన్నారు. కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. మహిళల్లోనూ ఇది వర్తిస్తుందట. మహిళలు సైతం.. తమ భర్తతో కలిసి ఉంటే  ఎక్కువ కాలం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారని తేలింది.

దాదాపు 6,051మందిపై నాలుగేళ్లపాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భర్త/ భార్యని కోల్పోయిన వారిలో  గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 71శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక విడాకులు తీసుకోవడం లాంటివి చేసిన వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం 41శాతం ఉంది. అసలు వివాహమే చేసుకోని వారిలో 40శాతం రిస్క్ ఉంది.
 

click me!