అమెరికాలో డెమోక్రాట్ల గద్దెనెక్కిన భారతీయ మహిళ!

First Published Jul 1, 2018, 9:42 AM IST
Highlights

అగ్రరాజ్యంలో మరోసారి భారతీయులు తమ సత్తా చాటారు. అమెరికాలోని డెమొక్రటిక్‌ పార్టీకి భారత సంతతికి చెందిన మహిళ సీమా నందా సీఈఓగా ఎంపికయ్యారు.

అగ్రరాజ్యంలో మరోసారి భారతీయులు తమ సత్తా చాటారు. అమెరికాలోని డెమొక్రటిక్‌ పార్టీకి భారత సంతతికి చెందిన మహిళ సీమా నందా సీఈఓగా ఎంపికయ్యారు. అమెరికాలో ఇంతటి గొప్ప పదవికి ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సీమా నందా చరిత్ర సృష్టించారు. ఈ పార్టీకి సంబంధించిన డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి సీమాను ఆపరేషనల్ హెడ్‌గా నియమిస్తున్నట్లు డీఎన్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ సందర్భంగా సీమా నందా మాట్లాడుతూ.. తనకు ఈ పదవి రావడం తన జీవితకాలంలో వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం అని అన్నారు. సీమా నియామకంపై కమిటీ చైర్మన్‌ టామ్‌ పెరేజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్‌, పౌరహక్కులపై ఆమెకు అపార అనుభవం ఉందని ఆయన అన్నారు. జులై నెల నుంచి సీమా నియామకం అమలులోకి రానుంది.

ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న మేరీ బెత్ కేహిల్ స్థానాన్ని భర్తీ చేయటం కోసం దాదాపు ఐదు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరకు ఈ పదవి సీమా నందాను వరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు బాధ పడతున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డెమోక్రాట్లు సానుకూల ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నామని సీమా అన్నారు.

click me!