అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రేసులో ఇండియన్!

First Published Jul 4, 2018, 10:42 AM IST
Highlights

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియామకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియామకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన ప్రముఖ జడ్జి అమూల్ థాపర్ (49) ఈ పదవికి షార్ట్‌లిస్ట్ చేయబడిన అతికొద్ది మందిలో ఒకరు. థాపర్ పేరును సెనేట్ ఆమోదిస్తే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా అమూల్ థాపర్ చరిత్ర సృష్టించనున్నారు. 

ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులతో కూడిన అమెరికా సుప్రీం కోర్టులో జస్టిస్ ఆంథోనీ కెన్నెడీ (81) పదవీ విరమణ చేయనున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన న్యాయమూర్తి కోసం వెతుకులాట ప్రారంభమయ్యింది. కెన్నడీ స్థానాన్ని భర్తీ చేసేందుకు 25 మంది జడ్జీలతో కూడిన జాబితా నుంచి నలుగురు జడ్జీలను షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో అమూల్ థాపర్ కూడా ఒకరు.

ఈ నలుగురి జడ్జీలను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేశారు. థాపర్‌తోపాటు బ్రెట్ట్ కావనాగ్, అమె కొనేయ్ బార్రెట్, రేమండ్ కేథ్లెడ్జ్‌లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. థాపర్‌కు సెనెట్‌లో అధికార పక్ష నేత మిచ్‌ మెక్‌ కాన్నెల్‌ మద్దతు ఉంది. మెక్‌ కాన్నెల్‌ సొంత రాష్ట్రమైన కెంటకీలోనే థాపర్‌ నివసిస్తూ, పనిచేస్తున్నారు.  తదుపరి న్యాయమూర్తిగా ఎవరు నియమితులవుతారనే విషయాన్ని వచ్చే సోమవారం ప్రకటిస్తామని ట్రంప్‌ తెలిపారు.

థాపర్‌ను గతేడాది ఒహాయోలోని సిన్సినాటిలో ఉన్న ఫెడరల్ సిక్స్త్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టుకు జడ్జీగా ట్రంప్ నియమించారు. ఈ కోర్టు థాపర్ స్వంత రాష్ట్రమైన కెంటకీతో పాటుగా మరో మూడు రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఇదివరకు ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన థాపర్‌ను అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2007లో ఈస్టర్న్ కెంటకీలోని ఫెడరల్ కోర్టుకు జడ్జీగా నియమించారు.

click me!