Parliament Session:‘క్రిమినల్‌’ బిల్లులకు రాజ్యసభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు 

Published : Dec 22, 2023, 05:09 AM IST
Parliament Session:‘క్రిమినల్‌’ బిల్లులకు రాజ్యసభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు 

సారాంశం

Parliament Session: భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కేంద్రం ప్రభుత్వం కొత్తగా మూడు నేర శిక్షాస్మృతి బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.   

Parliament Session:బ్రిటిష్‌ వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం  మూడు కీలక బిల్లులకు తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ (IPC)1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) 1873, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం 1872 స్థానంలో మూడు క్రిమినల్ బిల్లులను తీసుకవచ్చింది. ఆ బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) బిల్లులు ఆమోదించబడ్డాయి. హోం మంత్రి అమిత్ షా చర్చ తర్వాత, రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. వాటిని లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎగువ సభ నుండి 46 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి. 

మూడు క్రిమినల్ చట్టాల స్థానంలో పార్లమెంటు తీసుకొచ్చిన బిల్లులు ఆమోదం పొందాయి. భారతదేశ నేర న్యాయ ప్రక్రియలో పూర్తిగా భారతీయతతో కూడిన కొత్త ప్రారంభం ఉంటుందని అమిత్ షా అన్నారు. వాటి అమలు తర్వాత నాటి శకం ముగుస్తుందని కూడా ఆయన అన్నారు. ఈ బిల్లుల ఉద్దేశం గత చట్టాల మాదిరిగా శిక్షించడం కాదని, న్యాయం చేయడమేనని హోంమంత్రి షా అన్నారు. ఈ కొత్త చట్టాన్ని జాగ్రత్తగా చదివితే అందులో భారతీయ న్యాయ తత్వానికి చోటు కల్పించినట్లు తెలుస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు కూడా రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం 2019 నుంచి ఈ బిల్లులపై కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఉభయసభల్లో కొత్త న్యాయ బిల్లులు ఆమోదం పొందడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి చెప్పి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని తెలిపారు.

'ఆత్మ కూడా భారతీయమే, ఆలోచన కూడా భారతీయమే...'

ఈ చట్టాల ఆత్మ భారతీయులదేనని హోంమంత్రి షా అన్నారు. మొట్టమొదటిసారిగా.. మన నేర న్యాయ ప్రక్రియ భారతదేశం, భారత పార్లమెంటు నుండి రూపొందించబడిన చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను.'' ఈ చట్టాల స్ఫూర్తి కూడా భారతీయదేనని, ఆలోచన కూడా భారతీయదేనని, ఇది పూర్తిగా భారతీయమని అన్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్... ఈ మూడు చట్టాలు 1857 స్వాతంత్య్ర పోరాటం తర్వాత బ్రిటిష్ పాలనను రక్షించేందుకు రూపొందించామని హోంమంత్రి చెప్పారు. వారి లక్ష్యం బ్రిటిష్ పాలనను రక్షించడం మాత్రమే. ఇందులో భారత పౌరుడి భద్రత, గౌరవం, మానవ హక్కులకు ఎలాంటి రక్షణ లేదని అన్నారు. చట్టాల అమలు తర్వాత ఆనాటి శకం పోతుందని షా పేర్కొన్నారు. ఏ బాధితురాలికైనా మూడేళ్లలోగా న్యాయం జరిగేలాంటి వ్యవస్థ దేశంలో నెలకొల్పబడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, శాస్త్రీయ న్యాయ వ్యవస్థ అవుతుందని ఆయన అన్నారు.

హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఎంతో ఆనందంతో దేశద్రోహం అనే పదాన్ని వాడిందని, అధికారం నుంచి బయటకి రాగానే దేశద్రోహం వలసవాద చట్టమని, దానిని రద్దు చేయాలని చెబుతుందన్నారు. దేశద్రోహాన్ని అంతం చేయాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు. దేశద్రోహాన్ని శాశ్వతంగా తుదముట్టిస్తున్న మోడీ ప్రభుత్వం ఇది అన్నారు. విధాన రూపకల్పనలో ఈ దేశ మాతృశక్తికి తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చామని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ దేశ మాతృశక్తిని గౌరవించిందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu