రక్షణపరంగా భారత్‌ కీలక అడుగులు... అణ్వాయుధాల్లో పాక్‌ను మించేశాం

By Galam Venkata RaoFirst Published Jun 18, 2024, 11:25 AM IST
Highlights

రక్షణ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండే పాక్, చైనాలకు దీటుగా తయారవుతోంది. తాజాగా అణ్వాయుధాల విషయంలో భారత్.. పాక్ ను దాటేసింది.

రక్షణ రంగంలో భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. దేశాన్ని ఉగ్రమూకల నుంచి రక్షించుకోవడంతో పాటు కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియా రక్షణపరంగా మరింత ఆధునికంగా తయారవుతోంది. అధునాతన సాంకేతికత వినియోగించుకుంటూ ఆయుధాల తయారీ విషయంలో స్వయం ప్రతిపత్తిగా వ్యవహరిస్తోంది. మిత్రదేశాల నుంచి యుద్ద విమానాలు, ఆయుధాలను కొనుగోలు చేయడంతో పాటు సొంతంగానూ తయారు చేసుకుంటోంది. మరోవైపు అభివృద్ధి పరంగానూ దూసుకెళ్తున్న భారత్.. రక్షణకు, విదేశాలతో సత్సంబందాలు కలిగి ఉండటానికీ అంతే ప్రాధాన్యం ఇస్తోంది. 

ఈ నేపథ్యంలో తాజాగా భారత రక్షణకు సంబంధించి స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఓ విషయాన్ని వెల్లడించింది. అణ్వాయుధాల సమీకరణలో భారత్ పాకిస్థాన్‌ను దాటేసిందని ఓ నివేదికలో వెల్లడించింది. పాకిస్తాన్ కంటే భారత్‌లో ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి సిప్రి తెలిపింది. అయితే చైనా కూడా ఏమాత్రం తగ్గడం లేదట. జనవరి 2023 నాటికి చైనా వద్ద 410 అణ్వాయుధాలుండగా... ఈ ఏడాది 2024 నాటికి 500కి విస్తరించిందట. ఈ మేరకు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, స్వీడిష్ థింక్ ట్యాంక్ సోమవారం నివేదిక వెలువరించింది. 

Latest Videos

SIPRI నివేదిక ప్రకారం.. 
చైనా వద్ద అణ్వాయుధాలు జనవరి 2023లో 410 ఉండేవి.  2024 జనవరి నాటికి ఆ సంఖ్య 500కి పెరిగింది. చైనా ఇలా తన అణుశక్తిని పెంచుకుంటూ పోతోంది. 
యూఎస్‌, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్‌, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాలు తమ అణ్వాయుధాల ఆధునీకరణను కొనసాగిస్తున్నాయి. ఈ తొమ్మిది దేశాలు వాటి అణ్వాయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. అధునాతన అణ్వాయుధ వ్యవస్థలను మోహరించాయి. 
ఈ ఏడాది జనవరి నాటికి భారత్ ఉన్న అణ్వాయుధాల 172 కాగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి.
ఈ ప్రకారం చేస్తూ భారత్ 2023లో తన అణుశక్తిని కాస్త విస్తరించినట్లు తెలుస్తోంది. 
భారత్‌తో పాటు పాక్‌ కూడా 2023లో కొత్త రకాల న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం కొనసాగించింది. 
భారత అణ్వస్త్రాలను నిరోధించడంపై పాక్‌ ప్రధాన దృష్టి పెడితే... భారత్‌ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. 
చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో సహా సుదూర-శ్రేణి ఆయుధాలపై భారత్‌ దృష్టిపెట్టింది. 
రష్యా, యూఎస్‌కు చెందిన దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులను భారత్‌ హై ఆపరేషన్‌ అలెర్ట్‌లో ఉంచింది.  
మొత్తం ప్రపంచ దేశాలన్నిటి వద్ద ఉన్న అణ్వాయుధాల్లో రష్యా, యూఎస్‌ వద్దే దాదాపు 90 శాతం ఉన్నాయి.
జనవరి 2023 నాటి కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను రష్యా మోహరించినట్లు అంచనా.
చైనా వద్ద కూడా అణు వార్‌హెడ్‌ల నిల్వ ఉన్నప్పటికీ రష్యా, అమెరికా నిల్వల కంటే అది చాలా తక్కువగా ఉంటుందని అంచనా.

click me!