అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని అతిరధ మహారథులు సమక్షంలో దేశ ప్రజలందరూ భక్తిపారవశ్యంతో వీక్షిస్తుండగా రామమందిరంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేసారు ప్రధాని.

07:50 PM (IST) Jan 22
అయోధ్యలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్టను పురస్కరించుకుని దేశ విదేశాల్లోని భారతీయులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ఎన్ఆర్ఐలు ఆ దేశంలో రామాలయాన్ని నిర్మించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ జాతీయుడు పూజారిగా వ్యవహరించడం గమనార్హం.
07:34 PM (IST) Jan 22
అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జనవరి 29 నుంచి ఈ ఆస్థా రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అయోధ్యకు భక్తులను పంపనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నారు.
07:20 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామజ్యోతిని వెలిగించి, దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు
07:06 PM (IST) Jan 22
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. అయోధ్యకు దాదాపు 1000 కి.మీ దూరంలో మరో రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్లో ఈ రామాలయ నిర్మాణం జరిగింది. దీనికి అవసరమైన నిధులన్నీ స్థానికులే సమకూర్చుకున్నారు.
06:17 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఓ భక్తుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామకృష్ణ శ్రీవాస్తవ అనే భక్తుడికి గుండెపోటు రాగా.. వాయసేనలోని BHISHM క్యూబ్ బృందం వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. గోల్డెన్ అవర్లో చికిత్స లభించడంతో శ్రీవాస్తవ ప్రాణం నిలిచింది.
06:13 PM (IST) Jan 22
1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమా భారతి, సాధ్వి రితంబరలు దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
05:52 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం దీపోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు.
05:34 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వేడుక కనులపండుగా జరిగింది. దేశ విదేశాల నుంచి దాదాపు 7000 మంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరందరికి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రసాదం అందజేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా లక్నోలో 15 వేల స్వీట్ బాక్సులను తయారు చేయించింది. ఇందులో రెండు లడ్డూలు, బెల్లం రేవ్ డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద వున్నాయి.
05:23 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ తీరంలో రామమందిర నమూనాను తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రూపం కనువిందు చేస్తోంది.
05:15 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖేష్ దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు, కూతురు అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి అంబానీ ఫ్యామిలీ దిగిన ఫోటో వైరల్ అవుతోంది.
05:04 PM (IST) Jan 22
భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది. రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతిరోజూ 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించనున్నారని అంచనా. ఈ మేరకు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ పేర్కొంది. దీని ప్రకారం ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం వుంది.
04:58 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆలయ నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రెటీలు అలియా భట్ - రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్లు ఈ వేడుకకు హాజరయ్యారు.
04:39 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనమివ్వనున్నారు. వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం లభించనుంది. తొలి స్లాట్ ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గటల వరకు రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
04:29 PM (IST) Jan 22
అయోధ్య రామ మందిర ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, ఇంజనీర్ల బృందంపై మోడీ పూల వర్షం కురిపించారు.
04:14 PM (IST) Jan 22
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అద్భుతమన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమన్నారు. తాను అయోధ్యకు రావడం తన అదృష్టమన్నారు .
04:02 PM (IST) Jan 22
రామకార్యం అంటే రాజ్య కార్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సెల్ఫీ దిగి దానిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవాళ తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
03:50 PM (IST) Jan 22
రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని తానేనని ఆయన అన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్ లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై వుంటాయని యోగిరాజ్ పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు యోగిరాజ్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడిపై సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు.
03:39 PM (IST) Jan 22
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీలు అయోధ్యకు చేరుకుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది చారిత్రాత్మక దినమని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జనవరి 22న ఇకపై రామ్ దివాళీగా జరుపుకుంటారని అన్నారు.
03:33 PM (IST) Jan 22
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్లు అయోధ్య వేదిక వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ దిగారు.
03:26 PM (IST) Jan 22
అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇతర సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో వీరిపై స్వయంగా పూలు జల్లారు మోడీ.
03:18 PM (IST) Jan 22
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మనమంతా గర్వపడాల్సిన సమయమన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది కొత్త శకానికి ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రామ్ లల్లాకు ప్రధాని మోడీ పూజలు చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు.
02:56 PM (IST) Jan 22
దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్ ఇదే మన కొత్త నినాదమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ దేశంలో నిరాశవాదానికి చోటు లేదని, వున్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని మోడీ చెప్పారు. పరాక్రమవంతుడైన రాముడిని నిత్యం పూజించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
02:51 PM (IST) Jan 22
రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని.. ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనమని మోడీ చెప్పారు. మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమని.. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక అని మోడీ తెలిపారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేకపోయారని, పవిత్రత, శాంతి , సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపమని ప్రధాని వ్యాఖ్యానించారు. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానమని మోడీ తెలిపారు. అత్యున్నమైన ఆదర్శ వ్యక్తికి ఇవాళ ప్రాణ ప్రతిష్ట జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానమన్నారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్టే కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ట అన్నారు. రాముడు అగ్ని కాదని, రాముడు వెలుగు అని మోడీ పేర్కొన్నారు.
02:38 PM (IST) Jan 22
కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఇవాళ దీపావళిని జరుపుకుంటోందని, రాముడు భారతదేశ ఆత్మ అని ప్రధాని చెప్పారు. రాముడు లోకానికి ఆదర్శమని, అన్ని భాషల్లోనూ రామాయణం విన్నానని ఆయన తెలిపారు. రామమందిరాన్ని న్యాయమైన ప్రక్రియలో నిర్మించామని , ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టానని, అన్ని రాష్ట్రాల్లో వున్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించానని మోడీ చెప్పారు. 500 ఏళ్లుగా రామమందిరం నిర్మాణం ఎందుకు జరగలేదో అందరూ ఆలోచించాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాముడంటే వివాదం కాదని, రాముడంటే సమాధానమని మోడీ అభివర్ణించారు.
02:28 PM (IST) Jan 22
రామ్ లల్లా ఇక టెంట్లో వుండరు, గర్భగుడిలోనే వుంటారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాముడు వచ్చేశాడని, కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయమని మోడీ పేర్కొన్నారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం తన అదృష్టమని, ఈ క్షణం ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందని ప్రధాని తెలిపారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని, ఎక్కడ రాముని కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు వుంటాని మోడీ చెప్పారు.
ఎన్నో ఏళ్ల పోరాటాలు , బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ప్రధాని తెలిపారు. తన శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోందని, ఇది సామాన్యమైన సమయం కాదన్నారు. తన మనస్సంతా బాలరాముడి రూపంపైనే వుందని, రామాయణ కాలంలో 14 ఏళ్ల వనవాసం వుందని మోడీ చెప్పారు. రాముడి కోసం ప్రజలు 14 ఏళ్లు ఎదురుచూశారని, ఈ యుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు.
02:11 PM (IST) Jan 22
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్లకు యూపీ సీఎం యోగి ఆదత్య నాథ్ కానుకలు అందజేశారు. అయోధ్య ఆలయ ఆకృతిలో వుండే బహుమతులు సమర్పించారు.
02:09 PM (IST) Jan 22
అయోధ్యలో రామ్ లల్లాతో పాటు సరికొత్త భారత్ ఆవిష్కృతం అయ్యిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. చిన్నచిన్న గ్రామాల్లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జోష్ తో పాటు ఆలోచనలు చేయాల్సి వుందన్నారు. ప్రధాని చాలా కఠోర దీక్ష చేసారు.... ఆయన తపస్వి కాబట్టే చేసారన్నారు, అయోధ్యలోంచి రాముడు ఎందుకు బయటకు వెళ్లారో ఆలోచించాలని అన్నారు. 500 సంవత్సరాల తర్వాత రామయ్య తిరిగి అయోధ్యకు వచ్చారు... ఇది ఆనందదాయకమని అన్నారు.. ప్రధానిలాగే మనం కూడా రామరాజ్య స్థాపనకు కృషిచేయాలని మోహన్ భగవత్ సూచించారు.
02:00 PM (IST) Jan 22
500 ఏళ్ళ నిరీక్షణ తర్వాత రామమందిర నిర్మాణం జరిగిందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం యావత్ దేశం అయోధ్య వైపే చూస్తోందన్నారు. రామనామ స్మరణ వింటుంటే మనం త్రేతాయుగంలో వున్నట్లుగా వుందన్నారు. రామ భక్తుల హృదయంలో సంతోషం వుందన్నారు. ఎక్కడ మందిరం కట్టాలనుకున్నామో అక్కడే కట్టాం...
భారత ప్రజలు నిరీక్షణ ఈరోజు తీరిందన్నారు. ఈ కల సాకారం చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.అయోధ్య అభివృద్ది శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఆ రామయ్య కృపతో అయోధ్య ప్రశాంతంగా వుంటుంది. రామరాజ్య స్థాపన జరుగుతుందని యోగి అన్నారు.
01:45 PM (IST) Jan 22
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముగియడంతో 11 రోజుల ఉపవాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముగించారు. స్వామీజీ ప్రధానికి పాలు తాపి ఉపవాసాన్ని విరమింపజేసారు.
01:34 PM (IST) Jan 22
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు. అనంతరం అయోధ్య రామమందిర వెండి జ్ఞాపికలను యూపీ సీఎం ప్రధాని మోదీ, మోహన్ భగవత్ కు అందించారు. .
01:32 PM (IST) Jan 22
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాలువాతో సత్కరించారు.
01:28 PM (IST) Jan 22
రామమందిర ప్రారంభోత్సవాని విచ్చేసిన అతిథులకు ప్రధాని మోదీ నమస్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేరుకున్నారు.
01:24 PM (IST) Jan 22
అయోద్య రామమందిరంలో బాలరాముడికి తొలి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. అనంతరం రామయ్యకు తొలి హారతి కూడా ప్రధాని ఇచ్చారు. పూజల తర్వాత ఆలయంలో కలియతిరుగుతూ పరిశీలించారు ప్రధాని మోదీ.
01:16 PM (IST) Jan 22
ప్రధాని మోదీ బాలరాముడి చుట్టే ప్రదక్షిణలు చేసారు. అనంతరం రామయ్య ముందు సాష్టాంగ నమస్కారం చేసారు.
01:13 PM (IST) Jan 22
అయోధ్య బాలరాముడికి ప్రధాని మోదీ పూజలు ముగిసాయి. పూజా కార్యక్రమాలు ముగియడంతో ప్రధాని గర్భాలయం నుండి బయటకు వస్తున్నారు.
12:50 PM (IST) Jan 22
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడికి హారతి ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రామయ్యకు హారతి ఇచ్చారు. అయోధ్య బాలరాముడికి ప్రధాని ఫలాలు సమర్పించారు.
12:49 PM (IST) Jan 22
ప్రధాన మంత్రి మోదీతో పాటు అయోధ్య బాలరాముడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు నిర్వహించారు.
12:47 PM (IST) Jan 22
అయోధ్య బాలరాముడు ఆభరణాలు ధరించి మరింత సుందరంగా మారారు. ఆ రామయ్య ప్రాణప్రతిష్ట పూజలు అందుకుంటున్నారు.
12:40 PM (IST) Jan 22
12:39 PM (IST) Jan 22
అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అతిథులు మైమరచిపోయారు.