ఇండియాలో అయితే మాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వరు.. కానీ ఆమెనే పెళ్లి చేసుకుంటా.. ద్యుతీ చంద్ సంచలన వ్యాఖ్యలు

First Published Jul 13, 2022, 11:10 AM IST

Commonwealth Games: భారత స్ప్రింటర్, పరుగు పందెంలో దూసుకుపోతున్న ద్యుతీచంద్  తాజాగా తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే.. 

ఒడిశా లోని మారుమూల గ్రామం నుంచి  భారత్ కు పరుగుపందెంలో పథకాలు సాధించే క్రీడాకారిణిగా ఎదిగిన ద్యుతీ చంద్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనబోతున్నఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

కామన్వెల్త్ క్రీడలు, తన కెరీర్ లక్ష్యాలు, పెళ్లి, ఇతర విషయాలకు సంబంధించిన విషయాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి గురించి మాట్లాడుతూ.. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొద్దికాలంగా కలిసిఉంటున్న తన పార్ట్నర్ నే పెళ్లాడతానని చెప్పింది. 

2014 లో ద్యుతీకి నిర్వహించిన  వైద్య పరీక్ష (hyperandrigenism) లో ఆమె శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా  ఉన్నాయని తేలింది. ఈ కారణంగా ఆమెను 2014 కామన్వెల్త్ క్రీడల్లో ఆడించలేదు.  అయితే ఆమెను సర్జరీ చేయించుకోవాలని,  దానికనుగుణంగా మెడిసన్స్ తీసుకోవాలని  ఒత్తిడి వచ్చింది. అయితే ఆమె మాత్రం తాను ఎవరికోసం మారనని తెగేసి చెప్పింది.

కానీ ఆమె దీనిపై న్యాయపోరాటం చేసింది.    అయినా కూడా 2018లో ఆమె కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనలేదు. కానీ ఈనెల  28 నుంచి బర్మింగ్హోమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ గేమ్స్ లో ఆమె 200 మీటర్ల రేసులో బరిలోకి దిగుతున్నది. 
 

తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘అవమానాలు నాకేం కొత్త కాదు. నా చిన్నప్పుడు స్కూల్ లో అందరూ లడ్కా (బాలుడు)అని గేలి చేసేవారు. నా వాయిస్ బిగ్గరగా ఉండటం వల్ల అందరూ  అలా పిలిచేవారు. ఇక 2014 తర్వాత నేను చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటలోనే కాదు.  గ్రౌండ్ బయట కూడా ఇదే పరిస్థితి. అయితే ఆ క్రమంలో నేను స్ట్రాంగ్ గా ఉండటం నేర్చుకున్నా..’ అని చెప్పింది. 

ఇక 2019 లో ఆమె మరో మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నట్టు  బహిర్గతం చేసింది. ఇది పెద్ద సంచలనానికి తెరతీసింది.  ఆ కారణంగా కూడా తాను సొసైటీ తో పాటు సోషల్ మీడియాలో కూడా  తీవ్ర వివక్షతను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. 

‘2019 లో నేను  నా పార్ట్నర్ (ఆమె పేరు మోనాలిసా) తో నా రిలేషన్షిప్  ను ప్రకటించినప్పుడు చాలా వివక్షతను ఎదుర్కున్నా. సోషల్ మీడియాలో నామీద చెత్త కామెంట్లు పెట్టేవారు. తిట్టేవారు. చాలా సంస్థలు నన్ను విమర్శించాయి. మన సంస్కృతి ఏంటి..? నువ్వు చేస్తున్నదేంటి..? అని నన్ను ప్రశ్నించాయి.  అప్పుడు ప్రతి వేలు నామీదకే  చూసింది.. 

కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. చాలా మంది అథ్లెట్లు  ట్రాక్ లోనే పోరాడతారు. కానీ మేమ (హోమో సెక్సువల్స్) ట్రాక్ తో పాటు సొసైటీతోనూ పోరాడాలి.  మా వ్యక్తిగత జీవితాలు కూడా సమాజానికి సరుకే అయింది. కానీ ఇప్పుడు  నాకు ఇవన్నీ నా జీవితంలో సర్వసాధారణమయ్యాయి...’ అని తెలిపింది. 

తన పెళ్లి గురించి స్పందిస్తూ.. ‘గతంలో  చాలామంది నన్ను వ్యతిరేకించేవారు గానీ ఇప్పుడుచాలా మద్దతునిస్తున్నారు. భారత్ లో సేమ్ సెక్స్ మ్యారేజ్ లకు అంగీకారం లేదు. అందుకు చట్టం ఒప్పుకోవడం లేదు.  ఇక మా పెళ్లి గురించి చెప్పాలంటే.. మా బంధాన్ని మేం  పర్మినెంట్ చేసుకోవాలని భావిస్తున్నాం. 

నా పార్ట్నర్ కు ఇప్పుడు 22  ఏండ్లు. నాకు 26 ఏండ్లు. మేమిప్పుడు మా కెరీర్ లతో బిజీ ఉన్నాం. నేనైతే  ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ అని  ఇంటిపట్టునే ఉండటం లేదు.  మాకైతే 2024 పారిస్ ఒలింపిక్స్  తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాం..’ అని  చెప్పింది. 

అయితే ఇండియాలో హోమో సెక్సువల్ మ్యారేజెస్ కు సర్టిఫికెట్ ఇవ్వరు  కదా..?  మీరు వేరే దేశమేమైనా వెళ్లి పెళ్లి చేసుకుంటారా..? అని అడిగిన  ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఇప్పటికైతే మాకు అలాంటి  ప్రణాళికలేం లేవు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. అదీగాక పెళ్లి ఇక్కడ చేసుకోవాలా..? విదేశాల్లోనా ..? అనేది నా పార్ట్నర్  ఇష్టం. రెండేండ్ల తర్వాత తాను ఎలా అంటే అలాగే..’ అని  స్పష్టం చేసింది  ద్యుతీ.

click me!