
కరోనా వైరస్ మళ్లీ చైనాను వణికిస్తోంది. ఒక్కరోజుల్లోనే వందల కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో కూడా రాబోయే రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్, గుండె సమస్యలు, రక్తపోటు, శ్వాసకోశ రుగ్మతలు, మూత్రపిండాల సమస్యలు మొదలైన అంతర్లీన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ డయాబెటీస్ పేషెంట్లకు కరోనావైరస్ సోకితే.. తీవ్రమైన న్యుమోనియా, మంట కలిగే ప్రమాదం ఉంది. అంతేకాదు వీరు హాస్పటల్ లో చేరే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వెంటిలేటర్ పై కూడా వీరు చికిత్స తీసుకోవాల్సిన అవసరం వస్తుందట. అంతేకాదు కోవిడ్ వల్ల వీరికి మరణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లకు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరం ఇన్ఫెక్షన్లతో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కోవిడ్ వైరస్ సోకినప్పుడు .. మీకు డయాబెటిస్ ఉన్నా.. లేదా మీ కుటుంబ సభ్యుడికి ఏ రకమైన డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయినా.. కరోనా వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు షుగర్ పేషెంట్ అయితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా లక్షణాలను తెలుసుకోండి. అలాగే పరిశుభ్రత విధానాలను పాటించండి. ముఖ్యంగా చేతులను సబ్బుతో నీట్ గా కడగడం వంటి భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడ్డ ప్రామాణిక ప్రోటోకాల్, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండండి.
సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లడం మానుకోండి. అలాగే సోషల్ డిస్టెన్స్ ను పాటించండి.
డయాబెటీస్ మందులను క్రమం తప్పకుండా వాడండి. వాటిని ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకండి. మీ మధుమేహ మందులు మీ దగ్గర సరిపడా ఉన్నాయని నిర్ధారించుకోండి. హైపోగ్లైసీమియా లేదా ఏదైనా ఇతర డయాబెటిస్ పరిస్థితిని నియంత్రించడానికి మీ మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.
మీ రక్తంలో చక్కెరలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అలాగే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోనే ఉన్నాయని నిర్ధారించుకోండి.
కరోనా మీదున్న భయంతో మందులు వాడటం మానేయకండి.
మీకు మీరే చికిత్స తీసుకోకండి. ఏవైనా మందులు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడికి చూపించండి.
హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర) లేదా డయాబెటిక్ కెటోయాసిడోసిస్ సంకేతాలను గమనిస్తూ ఉండండి. ముఖ్యంగా ఇది టైప్ 1 డయాబెటిస్ రోగులలో ప్రాణాంతక సమస్యలను అభివృద్ధి చేస్తుంది. గ్లూకోజ్ ను శక్తిగా మార్చడానికి శరీరానికి తగినంత ఇన్సులిన్ లేనప్పుడు ఇది సంభవిస్తుంది, దీనివల్ల కొవ్వులు విచ్ఛిన్నమవుతాయి. రక్తంలో కీటోన్లు అని పిలువబడే ఆమ్లాలు ఏర్పడతాయి.
మహమ్మారి సమయంలో.. డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, దినచర్యను అనుసరించడం తప్పనిసరి. అలాగే శారీరక శ్రమలో తప్పకుండా పాల్గొనాలి.
మీరు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలనే తీసుకోండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం మానుకోండి, ఎందుకంటే అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా హెచ్చుతగ్గులకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.