
ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఆరోగ్యకరమైన జీవన శైలి, పోషణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ వారం రోజులు ఆరోగ్యానికి ఏ ఆహారాలు మంచివో అవగాహన కల్పిస్తారు. అయితే మనలో చాలా మంది ప్రోటీన్లు, విటమిన్లు లేని ఆహారాలనే తింటుంటారు. దీనివల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడి.. ఎన్నో రోగాలు సోకుతాయి.
వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, రోగాలను తరిమికొట్టే.. తొందరగా నయం చేసే రోగ నిరోధక వ్యవస్థ ప్రోటీన్లు, లిపిడ్లు, కార్భోహైడ్రేట్లు ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్లపై ఆధారపడి ఉంటుంది. ఇవి శరీరానికి పుష్కలంగా అందితేనే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఈ నేషనల్ న్యూట్రీషన్ వీక్ లో భాగంగా.. ఎప్పుడూ అలసటగా, నిద్రమత్తుగా ఎందుకు ఉంటారో తెలుసుకుందాం పదండి..
ఆహార అసమతుల్యత
మన శరీరానికి ఇందనం మనం తినే ఆహారమే. కానీ అతిగా తినడం విషంతో సమానం. అతిగా తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది నిద్రమత్తు, అలసటకు కూడా దారితీస్తుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. ఇది బరువును నియంత్రించడమే కాకుండా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, ఖనిజాలు అందుతాయి. మీరు తినే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. ఇవి ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడతాయి.
విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, కాల్షియం, జింక్ వంటివి లోపిస్తే కూడా నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కార్భోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రనాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కార్భోహైడ్రేట్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అలసిపోయినట్టుగా ఉండటంతో పాటుగా నిద్రమత్తుగా కూడా ఉంటుంది.
అలసటను, నిద్రమత్తును తగ్గించే ఆహారాలు
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు కూడా అలసటను, నిద్రమత్తును పోగొడుతాయి.
పండ్లు: స్ట్రాబెర్రీలు, జామ, బొప్పాయి, నారింజ వంటి సిట్రస్ పండ్లు
కూరగాయాలు: క్యారెట్, బ్రోకొలి, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, టమాటాలు, బచ్చలికూర మొదలైనవి.
గుడ్లు, చికెన్, చేపలు, పప్పు ధాన్యాలు
హైడ్రేట్ గా లేకపోవడం
శరీరంలో జీవరసాయన కార్యకలాపాల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఎప్పటికప్పుడు నీళ్లను పుష్కలంగా తాగుతూనే ఉండాలి. లేదంటే బాడీ డీహైడ్రేషన్ బారిన పడి అలసటను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
అధిక బరువు లేదా ఊబకాయం
ఆరోగ్యంగా ఉండేందుకు బరువు చాలా ముఖ్యం. ఊబకాయం వల్ల అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదం పెరుగుతుంది. ఇది పగటిపూట మీరు అలసిపోవడానికి దారితీస్తుంది. అయితే ఈ స్లీప్ అప్నియాతో సంబంధం లేకుండా ఊబకాయం పగటిపూట నిద్రతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ నిద్రచక్రాలను మారుస్తుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఇది మీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. మీకు తెలుసా నాణ్యమైన నిద్ర బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది. బద్దకాన్ని పోగొడుతుంది.
పేలవమైన నిద్ర
నిద్రలోనే కణాలు మరమత్తు చేయబడతాయి. అలాగే పునరుత్పత్తి అవుతాయి. గాఢమైన నిద్ర మిమ్మల్ని రీఫ్రెష్ గా, అలెర్ట్ గా, శక్తివంతంగా తయారుచేస్తుంది. ఒకవేళ మీరు కంటినిండా నిద్రపోకపోతే బాగా అలసిపోతారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు నిద్రలేమి సమస్యలను ఫేస్ చేస్తున్నట్టైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
మందుల ఎఫెక్ట్
కొన్ని రకాల మందుల వల్ల కూడా మగతకు కారణమవుతాయి. అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి వేసుకునే యాంటి డిప్రెంసెంట్స్, వాంతులు, వికారం, ఆందోళన, ముక్కు దిబ్బడ కోసం ఉపయోగించే ఔషదాలు కూడా ఎప్పుడూ నిద్రపోవడానికి దారితీస్తాయి.
వృద్ధాప్యం
వయసు పెరుగుతున్న కొద్దీ.. నిద్ర తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లు ఎక్కువ సేపు మంచంపై పడుకున్నప్పటికీ.. తరచుగా మేల్కొంటూనే ఉంటారు. అందుకే వీళ్లు వైద్యులు సిఫారసు చేసిన నిద్ర మందులను ఉపయోగిస్తారు. ఇది కూడా నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఇలాంటి సమయంలో కూడా అలసిపోయినట్టుగా భావిస్తారు. అయితే రోజూ అలసిపోయినట్టుగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది. వివిధ రుగ్మతలు, పోషకాహార లోపం, నిద్రకు అంతరాయం, కెఫిన్ ఎక్కువగా వాడటం, ఒత్తిడి వంటివి కూడా అలసటకు దారితీస్తాయి.