
రాజమౌళి(Rajamouli)తో సినిమా అంటే బ్లాక్ బస్టర్ పక్క. అది ఊహించని రేంజ్లో సక్సెస్ సాధిస్తుందనేది అందరి నమ్మకం. మొన్న `బాహుబలి`, ఇప్పుడు `ఆర్ఆర్ఆర్`(RRR)తో అదే విషయాన్ని నిరూపించారు. గత నెలలో విడుదలైన `ఆర్ఆర్ఆర్` సుమారు రూ.1200కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్(NTR), రామ్చరణ్(Ram Charan) హీరోలుగా నటించి నట విశ్వరూపం చూపించారు. రాజమౌళి మార్క్ ఎలివేషన్లకి, తారక్, చరణ్ నటన తోడవ్వడంతో సినిమా సంచలన విజయం సాధించింది.
అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాతి చిత్రం పరాజయం చెందుతుందనే నానుడి ప్రారంభం నుంచి టాలీవుడ్లో వినిపిస్తుంది. దీన్ని `రాజమౌళి సెంటిమెంట్`(Rajamouli Sentiment)గా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాలు పిలుచుకుంటారు. అదే నమ్ముతుంటారు. రాజమౌళితో చేసిన ఎన్టీఆర్(స్టూడెంట్ నెంబర్ వన్`, సింహాద్రి, యమదొంగ), ప్రభాస్(ఛత్రపతి, బాహుబలి), రవితేజ(విక్రమార్కుడు), రామ్చరణ్(మగధీర), నితిన్(సై), నాని(ఈగ), సునీల్(మర్యాద రామన్న) ఇలా అందరి విషయంలోనూ ఇదే జరిగింది. జక్కన్నతో సినిమా తర్వాత వారి నెక్ట్స్ మూవీస్ పరాజయం చెందాయి. ఆయా సినిమాలు ఫ్లాఫ్ కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ అంతా `రాజమౌళి సెంటిమెంట్`గానే నమ్ముతుండటం గమనార్హం.
అందరు హీరోలకు ప్రతి సారి ఇలానే జరగడంతో దాన్నే బలంగా నమ్ముతున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్` తర్వాత ఎన్టీఆర్, రామ్చరణ్ సినిమాలపై కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజన్లు. వారి అభిమానులు సైతం ఈ విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారి భయమే నిజమైందని అంటున్నారు క్రిటిక్స్. ఇంటర్నెట్లోనూ ఇలాంటి కామెంట్లే ఊపందుకున్నాయి. ఆ ప్రభావం ఫస్ట్ రామ్చరణ్పై పడిందంటున్నారు.
రాజమౌళితో చేసిన `ఆర్ఆర్ఆర్` తర్వాత రామ్చరణ్ నుంచి విడుదలైన సినిమా `ఆచార్య`(Acharya). తండ్రి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో చరణ్ కీలక పాత్ర పోషించారు. పరాజయం లేని సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే(Pooja Hegde) ఇందులో చరణ్కి జోడీగా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్ 29) గ్రాండ్గా విడుదలైంది.
సినిమాకి మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ వస్తోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా వరకు డిజప్పాయింట్ అయ్యారని అంటున్నారు. ఇలాంటి సినిమాని ఊహించలేదని, మెగాస్టార్ని పెట్టుకుని కొరటాల ఇలాంటి చిత్రం చేశారేంటని థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమాలోనూ అంత స్టఫ్ లేదు. బలమైన కథ లేదు. కథని సరిగా చెప్పలేకపోయారు దర్శకుడు కొరటాల. కమర్షియాలిటీకి, సందేశాన్ని జోడించి బాక్సాఫీస్ని షేక్ చేసే కొరటాల(Koratala Siva) ఈసారి డీలా పడిపోయాడని `ఆచార్య` ఫలితం చెబుతుంది.
`ఆచార్య`లో చిరంజీవిని ఏం చేయనీయకుండా చేశాడు దర్శకుడు. అదే సమయంలో రామ్చరణ్ పాత్రని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక రొమాన్స్ లేదు, కామెడీ లేదు. యాక్షన్ ఎపిసోడ్స్, కొంత మేర డాన్సులు తప్ప మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే అంశాలు ఇందులో కొరవడ్డాయి. సినిమా ఆసాంతం సీరియస్గా సాగుతుంది. ఫస్టాఫ్ వరకు స్లోగా సాగుతుంది. కథేంటో తెలియదు. సెకండాఫ్లో సిద్ధ పాత్ర(రామ్చరణ్) పరిచయం, ఆయన నేపథ్యమే ఉంటుంది. క్లైమాక్స్ లోవారి లక్ష్యాలను చెప్పారు. ఆ వెంటనే సినిమా అయిపోతుంది. రామ్చరణ్ పాత్రని చంపేసి సెంటిమెంట్ క్యాష్ చేసుకోవాలనుకున్న ఆలోచన కూడా బెడిసి కొట్టబోతుందని అంటున్నారు నెటిజన్లు.
మొత్తంగా `ఆచార్య` సినిమా ఫ్లాఫ్ జాబితాలో పడటం ఖాయమని తేల్చేస్తున్నారు. అదే జరిగితే రాజమౌళి సెంటిమెంటే గెలిచినట్టవుతుందని చెప్పొచ్చు. `ఆర్ఆర్ఆర్` తర్వాత చరణ్ నటించిన `ఆచార్య` పరాజయం రాజమౌళి సెంటిమెంట్కి బలాన్నిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు రాజమౌళి సెంటిమెంట్ కారణంగా నలుగురు చిరంజీవి, చరణ్, కొరటాల, పూజ బలయ్యారని, ఈ నలుగురు కలిసినా `ఆచార్య`ని కాపాడలేకపోయారని సెటైర్లు పేలుస్తున్నారు. సినిమా ఫ్లాఫ్కి చాలా కారణాలున్నా, `రాజమౌళి సెంటిమెంట్` అంటూ దాన్ని అంటగట్టడం గమనార్హం.