రంజాన్ స్పెషల్: ఇఫ్తార్‌లో ఖర్జూరానికి ఎందుకంత ప్రాముఖ్యం..?

By Siva KodatiFirst Published May 17, 2019, 12:03 PM IST
Highlights

రంజాన్ మాసంలో మసీదు, దర్గాల వద్ద ఎక్కువగా కనిపించేది, వినిపించేది ఖర్జూరం. అసలు ఈ మాసంలో ఈ పండుకు ఎంత ప్రాధాన్యమిస్తారో ఇస్లాం గ్రంథాల్లో తెలపబడింది.

రంజాన్ మాసంలో మసీదు, దర్గాల వద్ద ఎక్కువగా కనిపించేది, వినిపించేది ఖర్జూరం. అసలు ఈ మాసంలో ఈ పండుకు ఎంత ప్రాధాన్యమిస్తారో ఇస్లాం గ్రంథాల్లో తెలపబడింది. మహ్మాద్ ప్రవక్త ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఖర్జూరం పండు తీసుకునే వారని మత గ్రంథాలు చెబుతున్నాయి.

ఇతర నెలల్లో తక్కువగా లభించే ఖర్జూర పండు రంజాన్ మాసంలో బాగా పండుతుంది. ఈ పండును రెండు విధాలుగా స్వీకరించవచ్చు.. ఎండినవి ఒకరకం, పచ్చివి మరోరకం.. అయితే ఇఫ్తార్‌లో బాగా పండిన ఖర్జూరం పండ్లను ఆహారంగా స్వీకరిస్తారు.

ఎండు ఖర్జూరాలను నేరుగా తినే అవకాశం ఉన్నా... వీటిని ఎక్కువగా తీపి వంటలలో వినియోగిస్తున్నారు. ఖర్జూరం పండ్లు తీసుకోవడం వల్ల అలసట దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలంలో ఉపవాసం వుండటం వల్ల మధ్యాహ్న వేళకు కాస్త అలసట, నీరసానికి లోనవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం, నీరు తీసుకోకపోవడంతో శరీరంలోని చక్కెర శాతం బాగా తగ్గిపోయి మరింత నీరసానికి తగ్గిపోతుంది.

దీంతో ఉపవాసం విరమణ సమయంలో ఎండు ఫలాలు ఆహారంగా తీసుకోవాలని ఇస్లాం మత పెద్దలు సూచించారు. ఇక ఆరోగ్య పరంగా తీసుకుంటే ఖర్జూరంలో ఉండే పోషక విలువలు మరే ఫలంలోనూ వుండవు.. అత్యంత వేగంగా జీర్ణమయ్యే ఫలం ఇదే..

దీనిలో 100 గ్రాముల ఖర్జూర పండ్లలో 234 క్యాలరీల శక్తి ఉంటుంది. 1.8 గ్రాముల ప్రోటీన్లు, 55.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.5 గ్రాముల కొవ్వు, 7.6 గ్రాముల పీచు పదార్ధం, 4 మిల్లీ గ్రాముల సోడియం, 60.9 మిల్లీ గ్రాముల పొటాషియంతో పాటు ఐరన్, విటమిన్ బి పుష్కలంగా లభిస్తున్నాయి.

ఇక రంజాన్ మాసంలో విదేశాల నుంచి పలు రకాల ఖర్జూరాలు దిగుమతి అవుతున్నాయి. భారతదేశానికి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. 

click me!