విశాఖ పర్యటనలో భాగంగా చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదన్నారు.
తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడే వారికి తాను ఎప్పుడు అండగా ఉంటానని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ఎన్నికల తరువాత మొదటిసారి విశాఖ రావడం చాలా ఆనందంగా వుందన్నారు.
విశాఖ టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ...జగన్, వైఎస్సార్సిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాము అధికారంలో వున్నప్పుడు
సంక్షేమమే ద్యేయంగా కష్టపడి పనిచేసామన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనలో ఎపిని నెం1 గా నిలబెట్టామని తెలిపారు. అన్ని రకాల కార్యక్రమాలు విశాఖ నుండి చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేశామని తెలిపారు. తద్వారా స్థానిక రిజర్వాయర్లు నిండే విదంగా పథకాలు రచించామన్నారు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని....పోలీసులు ఆనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కేవలం మంచికి మంచిగా వుండే వ్యక్తిని మాత్రమే అని గుర్తుంచుకోవాలని సూచించారు.
సీఎం జగన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. ప్రభుత్వం రూపొందించిన ఇసుక విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. జగన్ టాక్స్ పేరుతో ఓ కొత్త ట్యాక్స్ ప్రవేశపెట్టి ప్రజలనుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
తాను చాలా ముఖ్యమంత్రులను చూసానని కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకోవాలి తప్ప రాజకీయ ప్రయోజనాలకోసం పనిచేయరాదన్నారు. తమ పాలనలో ఇటువంటి ప్రవర్తన ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు.
40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను చాలా చూసానని ప్రభుత్వానికి హెచ్చరించారు. టిడిపి నాయకుల టార్గెట్ గా ఈ ప్రభుత్వం కక్ష సాధింయడాన్ని ఆపాలని సూచించారు. విశాఖలో టిడిపి కుటుంబం తో గడిపిన సమయం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా టిడిపి కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాని అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కమిటీలు నియమిస్తామని... మహిళలకు, యువతకు, మూడో వంతు రిజర్వేషన్ కల్పించి మరో 5 వసంతాలకు సరిపడా పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో అమలుచేసి డబ్బు దుబారా కాకుండా చూస్తామన్నారు. దాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. రాయలసీమ జిల్లాకు నీరందించే ప్రణాళిక రూపొందించామని... దానిపై కూడా ఈ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
నీటి సమస్య విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనవసరపు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. నదుల అనుసంధానం ద్వారా నీటిని ఒరిస్సా నుండి కూడా తీసుకురావచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటిని నిల్వ పెంచాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
నీటి అవసరాలకు ప్రజల మధ్య చర్చ జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో 750 కోట్ల మిగులుతుందని దాని కోసం 7500 కోట్లు నష్టపోతున్నామని తెలిపారు. ఇసుక పాలసీ వలన 30 లక్షల కుటుంబాలు పండగ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.