Budget 2020: బడ్జెట్​లో బ్యాంకింగ్ రంగంపై ఏమైనా సంస్కరణలు తీసుకుంటుందా...?

By Sandra Ashok KumarFirst Published Jan 29, 2020, 5:49 PM IST
Highlights

క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. కొన్ని రోజులు లోక్ సభ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో ఈ రంగంలో ఏమైనా సంస్కరణలు తీసుకుంటుందా? మొండి బాకీల పరిస్థితి ఏంటి? ముద్ర రుణాల్లో పెరుగుతున్న ఎన్​పీఏల సమస్యను చక్కదిద్దటం ఎలా?

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తగ్గించడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకుల విలీనాన్ని ప్రతిపాదించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చింది. పెద్ద బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తాయని ప్రకటించింది. మొత్తంగా బ్యాంకులు కోలుకుంటాయని తెలిపింది.

also read Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు... 

కొంతకాలం క్రితం తీవ్ర చర్చకు దారి తీసిన అంశమైన మొండి బకాయిలు  తగ్గినట్లు ప్రభుత్వం చెబుతోంది. గణాంకాలు కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు మళ్లీ మొండి బాకీలు బారిన పడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. లిస్టయిన కంపెనీలకు కూడా నికర విలువ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి.

చిన్న తరహా పరిశ్రమలకు రుణాలందించటం కోసం ఉద్దేశించిన పథకం ముద్ర. ఈ రుణాల్లో ఎక్కువ శాతం తిరిగి చెల్లింపులు జరగట్లేదు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ముద్రా రుణాల్లో మొండి బకాయిలపై ఇంతకు ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రుణాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు సూచించింది.

మొండి బకాయిలతో బాధపడుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కొన్ని నెలల కిందట మూలధన సాయం అందించాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్న దృష్ట్యా ఈసారి మూలధన మద్దతు అందించకపోవచ్చని తెలుస్తోంది. ఐఎల్​ఎఫ్​ఎస్ సంక్షోభం తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై బడ్జెట్‌లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

also read  Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

బ్యాంకింగ్ రంగం సంక్షోభానికి ప్రైవేటీకరణ సమాధానమని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే దీనివల్ల సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రైవేటు బ్యాంకులపై నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతున్న వేళ ప్రభుత్వం జాతీయకరణ చేసిందని వారు గుర్తుచేస్తున్నారు.

ఫైనాన్సియల్ రిసోల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్​డీఐ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతాదారులకు బ్యాంకులో చేసిన జమకు కల్పించే బీమాను పెంచనున్నట్లు సమాచారం. దీని ద్వారా సహాకార బ్యాంకులను కూడా నియంత్రించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
 

click me!