బడ్జెట్ 2020:విద్యుత్ వాహనాలకు ‘నిర్మల’మ్మ ప్రోత్సాహాలిస్తారా...?

By Sandra Ashok KumarFirst Published Jan 28, 2020, 2:32 PM IST
Highlights

విద్యుత్ రంగ వాహనాల వినియోగంపై ద్రుష్టిని కేంద్రీకరిస్తోంది కేంద్రం. ఇప్పటికే బీఎస్-6 వాహనాల తయారీపై కేంద్రీకరించిన ఆటోమొబైల్ రంగం.. స్వల్ప, దీర్ఘ కాలిక విధానాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. అప్పుడు నిర్దేశిత లక్ష్యాల సాధనకు వీలవుతుందని సియామ్ కోరుతోంది.

న్యూఢిల్లీ‌: భారతదేశ దిగుమతుల్లో ముడి చమురు, పసిడిలదే ప్రధాన వాటా. భారత్‌ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద గుదిబండగా మారిన వస్తువు ముడి చమురు. దేశ దిగుమతుల్లో దాదాపు 80% చమురు రంగ వస్తువులే. దేశ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక మొత్తం దిగుమతుల చెల్లింపుల కోసమే కేంద్రం వెచ్చిస్తోంది. 

దిగుమతులపై పూర్తి పట్టు సాధిస్తే మన ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. పరిమితంగానే విదేశీ చమురుపై ఆధారపడాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ, అది అసాధ్యం కావడంతోపాటు నానాటికి పరిశ్రమలు.. వాహనాల సంఖ్య పెరిగిపోయి.. చమురు పద్దు తడిసి మోపెడవుతోంది.

also read బడ్జెట్‌ 2020:కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?

ఇప్పటికే దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కంపెనీలు ఉన్న పళంగా ఈ వాహనాల అభివృద్ధికి సిద్ధంగా లేరు. మరోవైపు వినియోగదారులు కూడా ఇప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రయాణికులు, రవాణ వాహనాల విభాగం వారు వీటిని వినియోగిస్తున్నారు.

మరోపక్క ప్రభుత్వమే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నది. కాకపోతే విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఏమాత్రం సరిపోవు.. మరింత చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఏఎంఈ-2 కింద ప్రభుత్వం ప్రైవేట్ రవాణ వాహనాల యజమానులను ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాలను కొనుగోలు చేస్తే జీఎస్‌టీ మినహాయిస్తామని కేంద్రం వెల్లడించింది.

ఒక్కసారి ఛార్జిచేస్తే 200 కిమీ పైగా ప్రయాణించే వాహనాలు మాత్రమే ఈ సబ్సిడీ పొందడానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ వాహనాల ప్రోత్సాహక పథకం నిబంధనలు వ్యక్తిగత వాహన కొనుగోలుదారుకు పెద్దగా ప్రయోజనకరంగా లేవు.

కానీ, వీరికి రూ.1.5లక్షల వరకు పన్ను రిబేట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల విద్యుత్ సైకిళ్లను కూడా విద్యుత్ వాహనాల పరిధిలోకి తీసుకొచ్చింది. కానీ, అవి ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్‌ పథకంలోకి తేలేదు. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడానికి నాలుగు రోజుల టైం ఉంది. దశాబ్దం క్రితం స్థాయికి వాహనాల విక్రయాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగ యాజమాన్య సంస్థలు ప్రోత్సాహాకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

ప్రస్తుతం ఆటోమొబైల్ సంస్థలు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలను ప్రత్యేకించి కార్లను అభివ్రుద్ధి చేస్తున్నాయి. ప్రభుత్వం 2032 నాటికి విద్యుత్ వాహనాలు 30 శాతం రోడ్లపై తిరుగాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలో చార్జింగ్ వసతుల్లో కీలకమైన లియాన్ బ్యాటరీల తయారీపై ప్రోత్సాహకాలు అందించాలని ఆటోమొబైల్ సంస్థలు ఆశిస్తున్నాయి.  

విద్యుత్ వాహనాల దిశగా బదిలీ అయ్యేందుకు ఆటోమొబైల్ రంగానికి మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి స్వల్ప, దీర్ఘ కాలిక వ్యూహాలు, విధానాలు అవసరం. లియాన్ ఆయాన్ బ్యాటరీలు విద్యుత్ కార్లు, బైకుల తయారీలో 45 శాతం ఖర్చు పెరుగుతున్నది. 
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న లియాన్ ఆయాన్ బ్యాటరీ సెల్స్ మీద ఐదు శాతానికి తగ్గించి వేయాలని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ కోరుతోంది. దేశీయంగా లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. 

also read  దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు మళ్ళీ బ్యాంకులు బంద్....

ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో విద్యుత్ సైకిళ్లపై రాయితీలను ప్రకటిస్తుందని చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఆశిస్తున్నాయి. విద్యుత్ కార్లు, బైకులు పొల్యూషన్‌ను తగ్గించిన ట్రాఫిక్‌ సమస్యను తీర్చడంలేదని.. అదే విద్యుత్ సైకిళ్లయితే ఆ సమస్యను కూడా తీరుస్తాయని పేర్కొన్నారు. 

ఇప్పుడిప్పుడే భారత్‌ మార్కెట్‌లో పూర్తిస్థాయి విద్యుత్ కార్లు ప్రవేశిస్తున్నాయి. ఎంజీ మోటార్స్‌, హ్యుండాయ్‌, టాటా మోటార్స్ తదితర సంస్థలు ఇప్పటికే విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి. పెరుగుతున్న వాహనాలకు సరిపడా విద్యుత్ ఛార్జింగ్‌ కేంద్రాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలకు కార్పొరేట్‌ తగ్గించడం, రాయితీలను కల్పించడం చేయాల్సి ఉంటుంది. 

దీనికి తోడు మేకిన్‌ ఇండియా కింద ఈ వాహనాల తయారీని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ రంగంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏమైనా చర్యలు ప్రతిపాదిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

click me!