ఐకియాకు భూ కేటాయింపు: కేసీఆర్ సర్కార్కు హైకోర్టు ప్రశ్నలు
హైద్రాబాద్లో ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్నీచర్ షోరూమ్కు ఏ ప్రాతిపదికన భూములు కేటాయించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు కోరింది
హైదరాబాద్: హైద్రాబాద్లో ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్నీచర్ షోరూమ్కు ఏ ప్రాతిపదికన భూములు కేటాయించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు కోరింది. అదే సమయంలో ఈ పిటిషన్ను ఎవరు దాఖలు చేశారో అని కూడ హైకోర్టు ఆరా తీసింది.
ఐకియా ఇండియా షోరూమ్కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం నాడు కోర్టు విచారణ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పాన్ మక్తాలో అత్యంత విలువైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా సంస్థకు తెలంగాణ సర్కార్ కేటాయించింది. ఈ విషయమై ఐకియా సంస్థకు నామినేషన్ పద్దతిన నిబంధనలకు విరుద్దంగా ఈ భూమిని కేటాయించారని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ భూములను ఐటీ సంస్థలకు పిటిషనర్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూమిని ఫర్నీచర్ షాప్కు ఈ భూమి కేటాయింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.33 కోట్లు మాత్రమే వచ్చాయని పిటిషనర్ వివరించారు. దీని వల్ల రూ.500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వచ్చిందని రేవంత్ పిటిషన్లో పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఐకియా సంస్థ మరో 3.17 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రిజర్వ్ చేశారని చెప్పారు.
ఈ విషయమై ఏ ప్రాతిపదికన ఈ భూములను కేటాయించారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ పిటిషన్ కోర్టులో ఎవరు దాఖలు చేశారనే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ పిటిషన్ను మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల తరపున చట్టసభల్లో తమ గొంతును విన్పించాలి, ఇలా కోర్టులకు ఎందుకు వస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.