భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితేమిటి?
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు ఏపీ రాష్ట్రంలో విలీనం చేయడంతో భధ్రాచలం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తగ్గింది
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు ఏపీ రాష్ట్రంలో విలీనం చేయడంతో భధ్రాచలం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన తాజా మాజీ ఎమ్మెల్యే సీపీఎం నేత సున్నం రాజయ్య ఏపీకి రాజకీయాలకు పరిమితం కానున్నారు.
2014 ఎన్నికలయ్యాక ఆర్డినెన్స్ తెచ్చి పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. ఆనాడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది.
చంద్రబాబునాయుడు పట్టుబట్టి ఈ మండలాలను ఏపీలో విలీనం చేయించారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయడం వల్ల భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తగ్గింది.
2014 ఎన్నికల సమయంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 మండలాలు ఉండేవి. భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం, చర్ల, వాజేడు, కూనవరం, చింతూరు, వీఆర్పురం మండలాలు 2014 ఎన్నికల సమయంలో భద్రాచలం నియోజకవర్గంలో ఉండేవి.
అయితే ఏపీలో ఏడు మండలాలు విలీనం కావడంతో భద్రాచలం నియోజకవర్గానికి చెందిన వీఆర్పురం, చింతూరు, కూనవరం మండలాలు ఏపీలో విలీనమయ్యాయి.
భద్రాచలం పట్టణం మినహా మండలమంతా కూడ ఏపీ రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. దీంతో ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం పట్టణం, దుమ్ముగూడెం, వెంకటాపురం, చర్ల, వాజేడు మండలాలు మాత్రమే మిగిలాయి.
ఏపీలో ఈ నియోజకవర్గానికి చెందిన మండలాలు కలవడం వల్ల సుమారు లక్ష ఓట్లు తగ్గాయనే అంచనా.2014 ఎన్నికల సమయంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య ఈ స్థానం నుండి విజయం సాధించారు.
సున్నం రాజయ్య స్వగ్రామం వీఆర్ పురం మండలంలోని సున్నం వారి వీధి. ఈ మండలం ప్రస్తుతం ఏపీలో విలీనమైంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం నుండి సున్నం రాజయ్య 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే మాజీ ఎంపీ , సీపీఎం నేత మిడియం బాబూరావుకు దుమ్ముగూడెం మండలం. దీంతో భద్రాచలం నియోజకవర్గం నుండి మిడియం బాబూరావు సీపీఎం అభ్యర్థిగా ప్రస్తుతం బరిలోకది దిగారు. బాబూరావు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి టి. వెంకట్రావు ప్రచారం నిర్వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు
నా పరిస్థితి ఏంటంటున్న ఎమ్మెల్యే